కర్మను అందుకే చంపాం: మావోయిస్టులు (పిక్చర్స్)
రాయపూర్: సల్వాజుడుం వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మను చంపడాన్ని మావోయిస్టు పార్టీ సమర్థించుకుంది. బస్తర్ ఆదివాసీలపై మహేంద్ర కర్మ సాగించిన అమానవీయ అత్యాచారాలు, హత్యాకాండలు, బీభత్సానికి ఇది న్యాయమైన ప్రతిస్పందన అని చెప్పుకుంది. సల్వాజుడుం గూండాలు, ప్రభుత్వ సాయుధ బలగాల చేతిలో హత్యకు గురైన వేయి మందికిపైగా ఆదివాసీల తరఫున తీర్చుకున్న ప్రతీకారమని చెప్పుకుంది.
చత్తీస్గడ్ పిసిసి అధ్యక్షుడు నందకుమార్ పటేల్ కాల్చివేతను కూడా సమర్థించుకుంది. మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి గుడ్సా ఉసెండి పేరిట జరిపిన దాడిపై ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. ఈ దాడికి తమ కమిటీదే బాధ్యత అని ఉసెండి స్పష్టం చేశారు. పీడకుడు, హంతకుడు, రేపిస్టు, దోపిడీదారు, అవినీతిపరుడిగా పేరొందిన మహేంద్ర కర్మ చావుతో బస్తర్ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొందని, గతంలో రాష్ట్ర హోంమంత్రిగా పని చేసిన నంద కుమార్కు ప్రజలపై నిర్బంధాన్ని ప్రయోగించిన చరిత్ర ఉందని వివరించారు.
కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా దోపిడీ విధానాల రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించారని, మహేంద్ర కర్మను, ఆయనతోపాటు కొందరు అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ నేతలను నిర్మూలించాలనే లక్ష్యంతోనే దాడి చేశామని చెప్పారు. అయితే ఈ సందర్భంగా రెండుగంటల పాటు జరిగిన ఎదురు కాల్పుల్లో చిక్కుకుని కొందరు నిర్దోషులు, తమ శత్రువులుకాని వారు కూడా ప్రాణాలు కోల్పోయారని, వారి మృతిపట్ల విచారం ప్రకటిస్తున్నామని ఆ ప్రకటనలో అన్నారు.
కాంగ్రెస్ అనుసరిస్తున్న అణచివేత విధానాల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్కు చెందిన బలగాలు తరచు ఛత్తీస్గఢ్లోకి ప్రవేశిస్తున్నాయని, అందుకే కాంగ్రెస్ బడా నాయకులపై దాడికి పాల్పడ్డామని తెలిపారు. మహేంద్ర కర్మ చేసిన తప్పులంటూ మావోయిస్టు పార్టీ ఆ ప్రకటనలో వివరాలు ఇచ్చింది.
మావోయిస్టులు దాడి చేసిన బస్తర్ కాంగ్రెసు పార్టీ పరివర్తన్ యాత్ర వద్ద వాహనాలు ఇలా..
మావోయిస్టులు దాడి చేసిన అరణ్య ప్రాంతంలో పడి ఉన్న మృతదేహాలు
కాంగ్రెసు కాన్వాయ్పై మావోయిస్టులు దాడి చేసిన ఘటనలో గాయపడిన విసి శుక్లాను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్న తరలిస్తున్న సెక్యూరిటీ అధికారులు
సంఘటనా స్థలంలో తునకలైన వాహనం..
పిసిసి అధ్యక్షుడు నందకుమార్ పటేల్. మావోయిస్టులు దాడి జరిపిన మర్నాడు ఆయన మృతదేహం అరణ్యంలో వెలుగు చూసింది.
మావోయిస్టుల దాడిలో గాయపడిన కాంగ్రెసు నాయకుడు రాయపూర్ ఆస్పత్రిలో..
ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాందీ బాధితులతో మాట్లాడుతున్న దృశ్యం
మావోల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శిస్తున్న ప్రధాని మన్మోహన్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ
మావోయిస్టుల దాడిలో మరణించినవారి సంతాపం తెలియజేయడానికి ఏర్పాటైన సమావేశంలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయ
మావోయిస్టుల దాడిపై రాయపూర్లో చర్చిస్తున్న ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, చత్తీస్గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్.