జగన్ను హీరోని చేశారు: భారతి, కుటుంబ విభేదాలపై...
వైయస్ ఉన్నప్పుడు జగన్ను ఎవరు తప్పు పట్టలేదని, జగన్ ఎప్పుడు రాజకీయ ప్రాధాన్యత కోరుకోలేదన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం తమ కుటుంబానికి పెద్ద షాక్ అని, ఆ తర్వాత ఆయన మృతిని తట్టుకోలేక చనిపోయిన వారిని జగన్ ఓదార్చాలనుకుంటే పెద్దలు అడ్డుపడ్డారన్నారు. వైయస్ చనిపోయాక పదిహేను నెలలకు జగన్పై కేసులు వేసి భయపెట్టాలని చూశారన్నారు.
కాంగ్రెసు నుండి బయటకు రావడం రాజకీయంగా ఆలోచించి చేసింది కాదన్నారు. ప్రజా సమస్యలపై రాస్తుంటే కొందరు సాక్షి పేపర్ బ్యాన్ చేయాలంటున్నారని, అదే వైయస్ కేబినెట్లో పని చేసిన వారు తమను ఉరి తీయాలి, వెలేయాలని మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన హయాంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాయమని జగన్కు వైయస్ చెప్పేవారన్నారు. సాక్షిలో చంద్రబాబు, కిరణ్.. ఇలా అందరి వార్తలు పెద్దగా వేస్తున్నామన్నారు. కొమ్ముకాసేలా ఉండొద్దనేది జగన్ అభిమతమన్నారు.
జైల్లో ఉన్నప్పటికీ జగన్ తమకు ధైర్యం చెబుతున్నారని, నిజానికి రెండున్నరేళ్లుగా చంద్రబాబు, కిరణ్లే జైళ్లో ఉన్నట్లుగా గడుపుతున్నారన్నారు. జగన్ మాత్రం బయట ఉన్నంత స్వచ్ఛంగా ఉన్నాడన్నారు. జగన్ చాలా మంచి బిజినెస్మెన్ అన్నారు. జగన్ తన టీంలోని వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడని, కుటుంబ సభ్యులను కూడా ప్రోత్సహిస్తాడని, అందుకే సాక్షి అభివృద్ధి చెందిందన్నారు.
తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. షర్మిల అన్న కోసం మండుటెండలో తిరుగుతున్నారన్నారు. జగన్ను ఇన్ని రోజులు జైళ్లో ఎందుకు పెట్టారో తెలియదన్నారు. తమకు దేవుని పైన నమ్మకముందని, ఆయన తప్పకుండా దారి చూపిస్తాడన్నారు. జగన్ బయటకు వచ్చే వరకు విజయమ్మ ప్రజాధరణను కాపాడాల్సిన బాధ్యత తీసుకున్నారన్నారు.