దాసరి: ఎన్టీఆర్ను ఎదుర్కొనేందుకు వచ్చి చిరుతో ఔట్?
దాసరి నారాయణ రావు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ప్రస్తుతం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవిది ఇదే సామాజికవర్గం. మూడు దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ టిడిపిని స్థాపించి కాంగ్రెసుకు వణుకు పుట్టించారు. ఎన్టీఆర్ కమ్మ సామాజిక వర్గం వ్యక్తి. ఈ నేపథ్యంలో 1989లో దాసరి ఎన్టీఆర్కు వ్యతిరేకంగా కాపునాడు మూమెంట్కు, కాపు సోషల్ ఆర్గనైజేషన్కు మద్దతుగా ప్రచారం చేశారు.
ఆ సమయంలో కాపులను రాజకీయంగా ఎదిగేలా చేయాలనే ఆలోచనతో ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపించాలని భావించారు. 1996లో పార్టీని స్థాపించాలనుకున్నారు. ఆ సమయంలో తెలుగు వారు అంతా ఒకటే అని చాటిచెప్పేందుకు టిడిపి ఎల్బీ స్టేడియంలో తెలుగు తల్లి విగ్రహాన్ని స్థాపించింది. దీంతో పార్టీ స్థాపించాలనే దాసరి వెనక్కి తగ్గారట. తాను పార్టీ స్థాపిస్తే టిడిపి వ్యతిరేక ఓట్లు చీలుతాయని భావించి, ఆయన కాంగ్రెసు పార్టీలో చేరిపోయారంటారు.
1996, 1998, 1999 సాధారణ ఎన్నికలలో దాసరి నారాయణ రావు కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసిన కాపు అభ్యర్థులకు జోరుగా ప్రచారం చేశారు. కాంగ్రెసు పార్టీ కోసం కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను 2000లో రాజ్యసభ పదవి వరించింది. ఓ వైపు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూనే, సినిమాలకు పని చేశారు. ఆ తర్వాత 2004లో యుపిఏ ప్రభుత్వం వచ్చాక కేంద్రమంత్రివర్గంలోకి తీసుకున్నారు.
దాసరికి అప్పుడు బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి పదవి అప్పగించారు. గనులకు రామ్ ఓలా, బొగ్గుకు శిబూ సోరెన్ మంత్రిగా ఉన్నారు. పలు ఆరోపణలతో శిబూ సోరెన్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో బొగ్గు శాఖను పూర్తిగా దాసరి చూసుకున్నారు. 2006లో గనుల శాఖ దాసరి నుండి పోయినా, బొగ్గు శాఖ మాత్రం ఉంది. ఈయన హయాంలోనే నవీన్ జిందాల్ కంపెనీకి ఐదు బొగ్గు గనులను కేటాయించారు. ఇందులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
2008 ఏప్రిల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థకరణలో మన రాష్ట్రానికి చెందిన దాసరి, టి.సుబ్బిరామి రెడ్డిలు కేబినెట్లో చోటు కోల్పోయారు. కచ్చితమైన కారణం తెలియనప్పటికీ వారిపై కాంగ్రెసు పార్టీ సంతృప్తి చెందలేదని చెబుతారు. రెండోసారి కాంగ్రెసు నుండి రాజ్యసభకు ఎంపికైన దాసరి పదవి కాలం 2012తో ముగిసింది. అప్పుడు మూడోసారి కూడా తనకే వస్తుందని ఆయన అనుకున్నారు.
ఇంతలో చిరంజీవి పిఆర్పీని విలీనం చేయడంతో ఆ పదవి ఆయనకు వరించిందని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. చిరుకు, దాసరికి ఒకరంటే ఒకరు గిట్టదనే వార్తలు ఎప్పుడూ వస్తుంటాయి. చిరు ప్రజారాజ్యంను కాంగ్రెసులో విలీనం చేయడం కూడా దాసరికి ఇష్టం లేదంటారు. చిరు పిఆర్పీని విలీనం చేశాక ఆయన కాంగ్రెసుకు పూర్తిగా దూరమయ్యారనే చెప్పవచ్చు.