సై: భూమన కౌంటర్, బాబు అడిగేవారు కాదు.. ధర్మాన
జగన్ ఏ తప్పు చేశాడని ఆయనను విమర్శిస్తున్నారని ఘాటుగా ప్రశ్నించారు. సభలో కళంకిత మంత్రులు అంటూ నానా యాగీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ... అవిశ్వాస తీర్మానం సమయంలో కాంగ్రెసు పార్టీకి బాసటగా ఎందుకు నిలిచిందని ప్రశ్నించారు. ఓ వైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సహరిస్తూనే, మరోవైపు కళంకితులంటూ యాగీ చేస్తోందన్నారు.
దోషులు అనలేదు: పయ్యావుల
తాము మంత్రులను మచ్చపడిన వారన్నామే కానీ దోషులు అనలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. దొంగలను కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకోవడం సరికాదన్నారు. కళంకిత మంత్రులను వెనుకేసుకు రావొద్దన్నారు. కిరణ్ తీరు దొంగల బండికి సారథ్యం వహిస్తున్నట్లుగా ఉందన్నారు. మచ్చ పడిన వారిని కళంకితలంటే తప్పా అని ప్రశ్నించారు. మంత్రుల అవినీతిపై తాము చర్చకు సిద్ధమన్నారు. కన్నా తన తనయుడికి భూమిని కట్టబెట్టారన్నారు.
బాబు అడిగేవారు కాదనుకుంటున్నా: ధర్మాన
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సభలో ఉండి ఉంటే ఇలాంటి చర్చకు అనుమతించాలని కోరేవారు కాదనుకుంటున్నానని ధర్మాన ప్రసాద రావు అన్నారు. మంత్రులపై వచ్చిన అభియోగాలపై చర్చకు తాము సిద్ధమన్నారు. చర్చకు అనుమతించని పక్షంలో టిడిపి వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలన్నారు. నాడు టిడిపి ఆపద్ధర్మ ప్రభుత్వ హయాంలో భూములను ఎలా కేటాయించారని ప్రశ్నించారు. మంత్రులపై సుప్రీం కోర్టులో ఎలాంటి కేసు ఉందో టిడిపికి తెలియదన్నారు.
ఉత్తరాఖండ్లో చిక్కుకున్న భక్తులపై ముఖ్యమంత్రి ప్రకటన
ఉత్తరాఖండ్లో భారీ వరదల వల్ల మన రాష్ట్రానికి చెందిన మూడువేల మంది చిక్కుకుపోయారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో ప్రకటించారు. పన్నెండు హెలికాప్టర్లు, ఆర్మీతో వారిని భద్రంగా తిరిగి పంపించే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు. ఎపి భవన్లో, డెహ్రాడూన్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ చిక్కుకున్న వారిని ఇబ్బంది లేకుండా వెనక్కి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
బాబులా కాదు: కన్నా
తాను చంద్రబాబు నాయుడు తన కోడలికి కట్టబెట్టినట్లు తన కొడుకుకు భూమిని కట్టబెట్టలేదని కన్నా లక్ష్మీ నారాయణ చెప్పారు. తన తనయుడు కొనుక్కున్నాడని చెప్పారు.