పోరాడి గెలిచారు: అవసరం ఉంటుందనే కావూరికి ఛాన్స్
కృష్ణాజిల్లా దోసపాడులో సాధారణ రైతు కుటుంబంలో సాంబశివరావు 1943 అక్టోబర్ 2న జన్మించారు. మచిలీపట్నం నుంచి 1984, 89, 98లోనూ ఏలూరునుంచి 2004, 09 ఎన్నికలలో విజయం సాధించారు. మంత్రి పదవికి తాను అన్ని విధాలా అర్హుడిగా ఆయన భావించారు. అందుకోసం ప్రయత్నాలు చేశారు. అయితే ప్రతిసారి విఫలమవుతూ వచ్చారు. గత విస్తరణలో అవకాశం వస్తుందని భావించారు. అయితే సీమాంధ్ర వాదం వల్ల పోయిందనే ప్రచారం జరిగింది. దీంతో అతను అలక వహించారు. విస్తరణ జరిగినప్పుడల్లా ఆశలు నిరాశ కావడంతో అంతులేని వ్యధకు లోనయ్యేవారు.
గతేడాది విస్తరణ సందర్భంగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఆయనకు ఫోన్ చేసి మరీ ఢిల్లీకి రప్పించడంతో పదవి ఖాయమని మానసికంగా సిద్ధమయ్యారు. కానీ, అవకాశం చేజారడంతో కుంగిపోయారు. అనంతరం 2012 అక్టోబర్ 28న సోనియా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్లతో పాటు స్పీకర్ మీరా కుమార్కు రాజీనామా లేఖ పంపారు. అటుపైన స్వయంగానూ స్పీకర్కు రాజీనామా అందజేశారు.
అధిష్టానంపై నిప్పులు చెరిగారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన బుజ్జగింపులతో ఆయన చల్లబడ్డారు. బడ్జెట్ సమావేశాల కు ముందు రాజీనామాను వెనక్కు తీసుకుని సోనియా, మన్మోహన్లకు స్వయంగా ఆ సంగతి చెప్పారు. ఈ నేపథ్యంతో పాటు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎంపీలకు నాయకుడుగా వ్యవహరించిన కావూరి అవసరం భవిష్యత్తులో చాలా ఉంటుందని అధిష్ఠానం భావించినట్లు తెలుస్తోంది.
చిరకాల స్వప్నం నెరవేరింది: కావూరి
కేబినెట్లో బెర్త్ దొరకడంపై కావూరి స్పందించారు. తనకు కేందద్రమంత్రి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని, పార్టీలో బాధ్యతలు ఇంకా పెరిగాయని అన్నారు. ఏ శాఖ అయినా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. తనకు కష్టపడి పనిచేయడం అలవాటని ఆయన తెలిపారు. ఎక్కడా సంకుచితంగా వ్యవహరించనన్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని కావూరి చెప్పారు. తన చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు.