హీరో టు లీడర్: మాటలతో ఇట్టే కట్టిపడేస్తారు(పిక్చర్స్)
హైదరాబాద్: మన నేతల్లో చాలామంది తమ మాటలతో ఆకట్టుకుంటారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిలు తమ మాటలతో, హావభావాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. సినిమాలలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఎన్టీఆర్.. రాజకీయాల్లోను అంతే స్థాయిలో విజయం సాధించారు. దీనికి ఆయన వాక్చాతుర్యం, హావభావాలే ప్రధాన కారణం! వైయస్ కూడా మాటలతో మంత్రముగ్ధులను చేసేవారు. ఆయన కట్టు అందర్నీ ఆకట్టుకునేది.
ప్రస్తుత రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్లర చంద్రశేఖర రావులతో పాటు తెరాస నేత హరీష్ రావు, టిడిపి నేతలు రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిలలు హావభావాలతో, మాటలతో ఆకట్టుకుంటున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన తెలుగును క్రమంగా మెరుగుపర్చుకుంటూ బాగానే మాట్లాడుతున్నారు. సిఎం అయిన ప్రారంభానికి, ఇప్పటికి కిరణ్లో చాలా తేడా వచ్చింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రారంభంలో ఇబ్బంది పడినా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2009 ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్లు తమ ప్రచార సత్తా ఏమిటో చూపించారు. నేతలు మాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

సినిమాల్లో వెలుగు వెలిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి ప్రవేశించి తొమ్మిది నెలల్లోనే అధికార పీఠం కైవసం చేసుకున్నారు. సినిమాల ద్వారా అప్పటికే ప్రజాధరణ ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించి.. తన మాటలు, హావభావాలతో ప్రజలను ఇట్టే కట్టిపడేసేవారు. నా ఆరు కోట్ల తెలుగు సోదర, సోదరీమణులారా.. అంటూ ఆయన ప్రసంగం ఎక్కువగా ప్రారంభించేవారు.

వైయస్ రాజశేఖర రెడ్డి అంటే తెల్లటి దుస్తులు, పంచె కట్టు గుర్తుకు వస్తాయి. తన కట్టుతో ఆయన ఎంతగా ఆకట్టుకునే వారో.. మాటలతోను అంతగానే ఆకట్టుకునే వారు. అక్కలారా... చెల్లెల్లారా... అంటూ ఆయన మాట్లాడేవారు. రోశయ్య లాంటి వ్యక్తులను అన్న అని సంబంధించేవారు. తన కన్న చిన్న వారిని తమ్ముడు అని పిలిచేవారు. వైయస్ ఇక్కడుంటే పంచె కట్టినా పలు సందర్భాలలో విదేశాలకు వెళ్లినప్పుడు సూట్ వేసేవారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాటలతో ఆకట్టుకుంటారు. అయితే ఆయన సీరియస్గా ఉంటారు. ఇటీవల కొంతకాలం మైక్ పట్టుకుంటే వదలడనే వాదన వచ్చింది. అయితే ఇటీవల కాలంలో ఆయన మరలా తన పాత మాటల మాంత్రికుడిగా మారిపోతున్నారు.

ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో రాజకీయ ఆరంగేట్రం చేసిన చిరంజీవి.. ప్రారంభంలో స్పీచ్ సందర్భంలో తడబడినా క్రమంగా మెరుగుపడ్డారు. పిఆర్పీని కాంగ్రెసు పార్టీని విలీనం చేసిన ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా విజయవంతంగా దూసుకెళ్తున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో మాటల మరాఠీ ఎవరంటే.. మొదట చెప్పే పేరు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ యాసలో మాట్లాడే కెసిఆర్... ఉర్దూలోను మాట్లాడి కట్టిపడేస్తారు. అయితే ఆయన తన స్పీచ్లో తిట్ల దండకం అందుకోవడాన్ని తప్పుపడుతుంటారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే ఆప్యాయత కనిపిస్తుంది. ఆయన మాటలు కట్టిపడేసేలా ఉన్నప్పటికీ.. ఓదార్పు యాత్రలో పదే పదే ఒకే రకమైన వ్యాఖ్యలు చేయడంతో కొంత బోర్గా ఫీలైన సందర్భాలున్నాయి.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాటలతో బుట్టలో వేసుకుంటారని టాక్ మీడియా ప్రతినిధులు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఏదైన విషయంపై స్పష్టంగా, సూటిగా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడుతారు.

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి లాగానే కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడుతారు. అయితే ఈయన మాటల్లో దూకుడు కనిపిస్తుంటుంది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల ప్రచారంలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని తలపిస్తున్నారు. ఆయనలాగే చేతులు ఊపుతూ, ప్రజలను పలకరిస్తున్నారు.

రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనప్పటికి చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2009 ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ప్రచారం చేశారు. అప్పుడు ఆయన కాంగ్రెసు నేతలను గుడ్డలూడదీసి కొట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసులో చిరంజీవి పార్టీని విలీనం చేసినప్పుడు... ఇదే ప్రశ్నను ఇతర పార్టీలు సంధించాయి.

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఆయన తన తాత స్టైల్లో ఆకట్టుకున్నారు. హవభావాలు, మాటలలో తాతను తలపించారు.












Click it and Unblock the Notifications