సోనియాకు డిగ్గీ 'టీ' నివేదిక: ప్రత్యేక రాయలసీమ రాగం
ఇదిలావుంటే, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన తెలంగాణ అంశంపై అధిష్టానం పెద్దలను కలుసుకునే అవకాశం ఉంది. రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి సి. రామచంద్రయ్య సోమవారం సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఆయన ఏం మాట్లాడారనే విషయం తెలియదు. రామచంద్రయ్య కేంద్ర మంత్రి చిరంజీవికి సన్నిహితుడు. చిరంజీవి తెలంగాణ అంశంపై ఏమీ మాట్లాడడం లేదు. అయితే, తన వర్గానికి చెందిన సి. రామచంద్రయ్య, మరో మంత్రి గంటా శ్రీనివాస రావు ద్వారా సమైక్యాంధ్ర కోసం పావులు కదుపుతున్నట్లు అనుమానిస్తున్నారు.
విభజన ఖాయమనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రాయలసీమ నేతలు ప్రత్యేక రాయలసీమ రాగాన్ని అందుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వారు విభజన ఖాయమైతే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని సూచిస్తున్నారు. తెలంగాణ ఇవ్వదలుచుకుంటే, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాయలసీమకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ శనివారం అన్నారు. విభజన అనివార్యమైతే రాయలసీమ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. రాయలసీమకు ప్రత్యేక చరిత్ర, సంస్కృతి ఉన్నాయని ఆయన అన్నారు. రాయలసీమకు చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా దాదాపు అదే మాట అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేదంటే మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రాల సెంటిమెంటు కూడా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి బదులు వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేద్దామని ఆయన అన్నారు.