విభజన ఆలోచన: హైదరాబాద్ను ఏం చేద్దాం?

శుక్రవారం సాయంత్రం కోర్ కమిటీ సమావేశం జరిగే లోగా ఆ ముగ్గురు నాయకుల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు తాము చేస్తున్న ఆలోచనలను వారికి చెప్పాలని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు అనుకుంటున్నట్లు సమాచారం. కోర్ కమిటీ సమావేశం జరిగే లోగా వారు ముగ్గురు కూడా కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్, ఆర్థిక మంత్రి పి. చిదంబరాలను కలిసే అవకాశం ఉంది. వీలైతే వారితో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా సమావేశమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
శుక్రవారం జరిగే కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణ అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని, ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం తేదీని నిర్ణయిస్తారని అంటున్నారు. రాష్ట్రాన్ని విభజించాలని ఓ నిర్ణయానికి వచ్చిన కాంగ్రెసు అధిష్టానం హైదరాబాద్ను ఏం చేయాలనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ను తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా చేసి, కొన్నాళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే ప్రతిపాదన ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, మరో రెండు ప్రత్యామ్నాయాలపై కూడా కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెడుతున్నట్లు సమాచారం. అందుకే, తెలంగాణపై నిర్ణయం విషయంలో దిగ్విజయ్ సింగ్ ఇంతకు ముందు రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడారని అంటున్నారు.
రాజ్యాంగంలోని రెండు ఆర్టికల్స్ అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలకు అడ్మినిస్ట్రేటర్స్ నియమించే 239 ఆర్టికల్, ఢిల్లీ పాలనయంత్రాంగాన్ని నడిపే 239ఎఎ ఆర్టికల్స్ గురించి అధిష్టానం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ను అంగీకరించడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు సిద్ధంగా లేరు. కానీ, ఢిల్లీ తరహా వ్యవస్థకు అంగీకరించే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications