ఇరుకున పడేశారా?: తెలంగాణతో జగన్ పార్టీ హైజాక్
హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందనే ఊహాగానాలు, అధిష్టానానికి సీమాంధ్ర మంత్రుల హెచ్చరిక, పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లుగా కనిపిస్తోంది. అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసే ఉద్దేశ్యంలో భాగంగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా పర్వానికి తెర తీసి ఉంటారని భావిస్తున్నారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెసు పార్టీ వైఖరి చెప్పాలని, ఆ తర్వాత రాష్ట్రంలోని పార్టీలతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేస్తూ రాజీనామా చేశారు. అయితే ఇదంతా వ్యూహాత్మకంగానే జరిగిందని అంటున్నారు. కొన్నాళ్లుగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడే వారు మూకుమ్మడిగా రాజీనామా చేయడం వెనుక పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయని అంటున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో జగన్ పార్టీ సీమాంధ్రలో మూడో స్థానంలో నిలిచినప్పటికీ ఆశించిన స్థాయిలోనే ఫలితాలు సాధించింది. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నం. మొదటి నుండి ఆ ప్రాంతంలో జగన్ పార్టీ పట్టు ఏమాత్రం కనిపించలేదు. అది నిజమే అన్నట్లు తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ తేలిపోయింది. మహబూబ్ నగర్ జిల్లా మినహా మిగిలిన ఏ జిల్లాలోను ఆ పార్టీ మంచి ఫలితాలు సాధించలేదు.
ఇదే సమయంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం మరింత జోరందుకుంది. దానిని అడ్డుకునేందుకు ఏం చేయాలనే అంశంపై చర్చించేందుకు సీమాంధ్ర మంత్రులు బుధవారం సాయంత్రం మినిస్టర్స్ క్వార్టర్సులో భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా విభజనపై రాష్ట్రంలో మరింత వేడి రాజుకుంది. సీమాంధ్ర మంత్రుల భేటీపై తెలంగాణ ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు కూడా ధీటుగానే స్పందించారు.
తెలంగాణలో తమ పార్టీ తేలిపోవడంతో సీమాంధ్ర ప్రాంతంలోనైనా మరింత పట్టు పెంచుకునే ఉద్దేశ్యంలో భాగంగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామా పర్వానికి తెర లేపారంటున్నారు. ఇప్పటికే సీమాంధ్ర మంత్రులు విభజనపై వేడి రాజేశారు. వారు రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా సాగింది. ఇదే సమయంలో 'సమైక్య'న్ని హైజాక్ చేయవచ్చునని జగన్ పార్టీ నేతలు భావించి ఉంటారని అంటున్నారు.
ఇరుకున సీమాంధ్ర కాంగ్రెసు!
జగన్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ద్వారా సీమాంధ్ర కాంగ్రెసు నేతలను ఇరుకున పెట్టారనే చెప్పవచ్చు. తాము సమైక్యాన్నే కోరుకుంటున్నామని గట్టిగా చెబుతున్న మంత్రులు, కాంగ్రెసు నేతలు అధిష్టానం నిర్ణయం వచ్చే వరకు వేచి చూసే అవకాశాలు ఉన్నాయి.
అయితే అంతలోపే జగన్ పార్టీ రాజీనామా చేసి వారిని ఇరుకున పడేసే ప్రయత్నాలు చేసిందంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా వస్తే ఇన్నాళ్లు మౌనం ఎందుకు వహించారని, వ్యతిరేకంగా వస్తే తమ రాజీనామాల వల్లనే అని చెప్పుకునే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు సైలెంటుగా ఉన్న టిడిపిని కూడా ఇరకాటంలో పడేయడంతో పాటు పునరాలోచనలో పడేసినట్లుగా పలువురు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications