జగన్ పార్టీలో తెలంగాణ చిచ్చు: విజయమ్మ నిలదీత

భేటీలో తెలంగాణ నేతలు విజయమ్మను ఒకింత నిలదీసినట్లుగా సమాచారం. తెలంగాణపై పార్టీ వైఖరి చెప్పాలని, తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని, పార్టీ సమైక్యవాదం వినిపిస్తే తాము తమ దారి తాము చూసుకుంటామని భేటీలో పాల్గొన్న పలువురు నేతలు ఘాటుగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా వారు మూడు ప్రశ్నలను వారి ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణపై ప్లీనరీలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారా?, ఎమ్మెల్యేల రాజీనామాలు వ్యక్తిగతమా, కాదా?-వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?, తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నారా? అని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. వారికి విజయమ్మ సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారని సమాచారం. అయితే వారికి తెలంగాణ విషయంలో అధిష్టానం నుండి ఎలాంటి హామీ రానట్లుగా తెలుస్తోంది.
పార్టీ వీడుతారా?
భేటీ అనంతరం తెలంగాణ ప్రాంత నేతల తీరును బట్టి వారికి హామీ లభించనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో టి నేతలు భేటీ అయి ఓ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. భేటీ నుండి బయటకు వచ్చిన కొండా మురళి ఒకింత ఘాటుగా స్పందించినట్లుగా వార్తలు వచ్చాయి. తెలంగాణ ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవం ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారట. తాము ఇప్పటికిప్పుడు ఏమీ మాట్లాడలేమని సురేఖ చెప్పారు. కోటరీ నిర్ణయాలు అమలుపరుస్తున్నారని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
రాజీనామాల వ్యక్తిగతం: ఎమ్మెల్యేలు
తమ రాజీనామాలు వ్యక్తిగతమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, చెన్నకేశవ రెడ్డి తదితరులు చెప్పారు.












Click it and Unblock the Notifications