చిరు, కావూరిలకు భద్రత పెంపు: సీమాంధ్రకు బలగాలు
రేపు మంగళవారం సాయంత్రం తెలంగాణపై సిడబ్ల్యుసి సమావేశం తుది నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో సీమాంధ్రకు అదనపు బలగాలను తరలిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మరో 1200 పారా మిలటరి బలగాల జవాన్లు సీమాంధ్రకు చేరుకుంటున్నారు. గత వారం రోజులుగా సీమాంధ్రకు 23 కంపెనీల పారా మిలిటరీ బలగాలను తరలించారు. మరో 22 కంపెనీల బలగాలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 1000 బలగాలు రాష్ట్రానికి చేరుకుంటున్నాయి. మరిన్ని బలగాలు సీమాంధ్రకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆంధ్రలోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం నగరాలకు బలగాలను పెద్ద యెత్తున తరలించారు. ఈ బలగాలు పూర్తిగా శాంతిభద్రతల పరిరక్షణపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రానికి దిగిన పారా మిలటరీ బలగాలను శాంతిభద్రతల పరిరక్షణకు తప్ప మరో పనికి వినియోగించకూడదని ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అయితే, ఈ బలగాల మోహరింపుపై రాష్ట్రానికి చెందిన నాయకులు ఏమీ మాట్లాడడం లేదు. పారామిలటరీ బలగాల మోహరింపుపై విశాఖపట్నం సమైక్యాంధ్ర జెఎసి నాయకులు నిరసన వ్యక్తం చేశారు.