టి: కిరణ్ రాజీనామాపై కలకలం, తెలియదని బాలరాజు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కిరణ్ తీవ్రంగా పోరాడుతున్నారని మంత్రి బాలరాజు అన్నారు. ఆయనకు అన్ని రకాలుగా బాసటగా నిలుస్తామని, క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలుగా పని చేస్తామన్నారు. వెనుకబాటుతనమే విభజనకు ప్రామాణికమైతే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజనుల మాటేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు.
విభజన ఖాయమైతే ప్రాంతాలకు అతీతంగా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం, అనంతపురం వరకూ ఉన్న గిరిజనులందరినీ దృష్టిలో పెట్టుకుని వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర కేంద్రమంత్రులు ఐదుగురు, కొందరు ఎంపీలు ప్రధానికి రాజీనామాలు అందజేశారన్నారు. విభజన ఆపలేని పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి రాజీనామా చేసేస్తారని టిజి చెప్పిన విషయం తెలిసిందే.
అయితే కిరణ్ రాజీనామా గురించి మాత్రం తెలియదన్నారు. సిఎం కూడా ఇప్పటికీ ఈ అంశంపై గుంభనం పాటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ముభావంగా ఉంటున్నారని మాత్రం స్పష్టమవుతోంది. శనివారం ఆయన సచివాలయానికి రాలేదు. నల్సార్ కార్యక్రమానికి వెళ్లి వచ్చాక క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. ఆదివారం ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నాక క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు.
కాగా, శనివారం రాత్రి తనను కలిసిన సీమాంధ్ర ప్రాంత మంత్రులముందు కిరణ్ నిర్వేదం ప్రదర్శించినట్లు తెలిసింది. అధిష్ఠానానికి చెప్పాల్సిందంతా చెప్పామని, చేయాల్సిందంతా చేశామని, కలసి ఉంటే ప్రయోజనాలు, విడిపోతే నష్టాల గురించి వివరించామని, ఇంతకన్నా ఏం చేయగలమని, పార్టీ పెద్దలముందు గట్టిగా మాట్లాడినట్లు మీడియాలో వచ్చిందని, రాని విషయాలు చాలా ఉన్నాయని కిరణ్ చెప్పారట.