ఇళ్ల ముట్టడి: సీమాంధ్ర నేతలకు సమైక్య సెగ
విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు, కేంద్ర మంత్రి పురంధేశ్వరి, పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి కార్యాలయాలను ముట్టడించడానికి సమైక్యాంధ్ర జెఎసి కార్యకర్తలు ప్రయత్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సమైక్యాంధ్రకు మద్దతుగాకేంద్ర మంత్రి కావూరి ఇంటి ముట్టడికి సమైక్యాంధ్ర జెఎసి ప్రయత్నించింది. గుంటూరులో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు ఇంటిని ముట్టడించడానికి సమైక్యాంధ్ర జెఎసి కార్యకర్తలు ప్రయత్నించారు.
తిరుపతిలో పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ నివాసం వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆందోళన చేపట్టింది. రాజీనామా చేయాలని వారు చింతా మోహన్ను డిమాండ్ చేస్తున్నారు. కడపలో సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ నివాస ముట్టడికి సమైక్యాంధ్ర జెఎసి కార్యకర్తలు ప్రయత్నించారు.
కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ నివాసాన్ని జెఎసి ముట్టడించింది. సీమాంధ్ర జేఏసీ ర్యాలీలో ఎంపీ సాయిప్రతాప్ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విడగొడితే సహించేది లేదని, అవసరమైతే రాజీనామాలకు సిద్ధమని సాయి ప్రతాప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి నివాసాన్ని సీమాంధ్ర జెఎసి ముట్టడించింది.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్రకు మద్దతుగా లగడపాటి రాజగోపాల్ ఇంటిని ముట్టడించిన సమైక్యాంధ్ర ఉద్యోగ జెఎసి నాయకులు నివాసంలోకి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. కాగ, సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ జేఏసీ నేతలు ఐదంస్థుల భవనం ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.