కెసిఆర్కు మరో షాక్: విజయరామారావు రాజీనామా
విజయ రామారావు అక్కడే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. గత 6 నెలల నుంచే తాను తెరాస పట్ల అసంతృప్తితో ఉన్నానని అయితే, తాను అప్పుడే రాజీనామా చేస్తే తెలంగాణ ఉద్యమానికి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని చెప్పారు. కెసిఆర్కు తాను రాజీనామా లేఖను ఇచ్చినప్పుడు తెలంగాణ వచ్చేసిందని, మంచి అవకాశాలు ఉన్నాయని ఎందుకు వెళ్లిపోతున్నారని అడిగారని, దానికి తాను తనకు తెలంగాణ రావడం కన్నా మించిన అవకాశం లేదని చెప్పానన్నారు.
తాను 2001 నుండి నిజాయితీగా, నిస్వార్థంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించానని చెప్పారు. కానీ, ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో పార్టీకి నాయకత్వం వహిస్తున్న వారు ఉద్యమంలో పాల్గొనని వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలను కెసిఆర్ దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకుపోయినా స్పందన లేదని ఆరోపించారు.
తన లక్ష్యం, గమ్యం ప్రత్యేక తెలంగాణ అని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నిర్ణయం తీసుకుందని, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేసిందని, తెరాస, కాంగ్రెస్ కలిసినా కలవకపోయినా పార్టీ నాయకత్వం పటిష్ఠంగా ఉందన్నారు. తనలాంటి వాళ్ల అవసరం పార్టీకి లేదన్నారు. అందుకే రాజీనామా చేశానని చెప్పారు.
కాగా, రెండురోజుల క్రితం ఆయన తెరాస నేతలు చంద్రశేఖర్, చందూలాల్తో కలిసి ఢిల్లీలో ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ను కలిసిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్ కూడా రాజీనామా చేస్తారనే వాదనలు వినిపిస్తున్నా ఆయన ఖండించారు. తాను తెరాసలో కొనసాగుతున్నట్లు చందూలాల్ చెప్పారు.