తెలంగాణకు చెల్లుచీటి, ఇక సీమాంధ్రే: జగన్ తికమక!
అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీరులో మాత్రం సమైక్యవాదం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీపై సమైక్యవాద ముద్ర పడటం, తెలంగాణలో ఖాళీ అవుతున్న నేపథ్యంలో జగన్ ఇక తెలంగాణకు చెల్లుచీటి ఇచ్చి.. సీమాంధ్రకే పరమితమవుదామనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందులో భాగంగానే చివరకు జగన్, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మలు రాజీనామా చేశారని అంటున్నారు. సమైక్యంపై దూకుడు పెంచాలని భావిస్తోందంటున్నారు.
రాష్ట్ర విభజన సమస్య నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఇప్పటికే 16 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇప్పటికే రాజీనామాలు చేశారు. తాజాగా జగన్, విజయమ్మలు కూడా చేశారు. భవిష్యత్తులోనూ సమైక్యవాదంతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న క్రమంలోనే పార్టీ అగ్ర నాయకత్వం కూడా రాజీనామా బాట పట్టిందంటున్నారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ప్రకటన, తాము తీసుకున్న వైఖరి కారణంగా ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీ దాదాపు ఖాళీ అయింది. ఒకవేళ రాష్ట్రం విడిపోయినా, కలిసి ఉన్నా ఇక్కడ మళ్లీ బతికి బట్టకట్టే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించకపోవటంతో సీమాంధ్ర ప్రాంతం ఒక్కటే తమ కార్యక్షేత్రంగా పార్టీ భావిస్తోంది. ఈ మేరకు విభజన ప్రకటన వెలువడ్డాక సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా అండదండలు అందిస్తున్నారు.
రాజీనామాలు చేసి ఉండటంతో ఎమ్మెల్యేలు నేరుగా ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. కాలక్రమంలో కాంగ్రెస్, టిడిపి ప్రజా ప్రతినిధులు, నాయకులు అనివార్యంగా సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణాలు ఏమైనా వారు కూడా రాజీనామాలు చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపై వెనక్కి తగ్గేది లేదని చెబుతుండటం, ఇటు సీమాంధ్ర ప్రజలు రాష్ట్రం సమైక్యంగానే ఉండాలనే ఉద్యమాన్ని ఆపే పరిస్థితి కనిపించకపోవటం వెరసి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
అన్ని పార్టీల మధ్య పరస్పర విమర్శలు, దూషణల పర్వం కొనసాగుతోంది. సీమాంధ్ర ప్రజల ఉద్యమం దరిమిలా కాంగ్రెస్కు చెందిన అక్కడి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, టిడిపి ప్రజా ప్రతినిధులు, నాయకులు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ దశలో జగన్, విజయమ్మలు రాజీనామా చేయటం వ్యూహాత్మకమేని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో, కాంగ్రెస్, టిడిపిలపై మరింత ఒత్తిడి పెంచారనే చెప్పవచ్చు. అదే సమయంలో తాము తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి విభజన విషయంలో ఏమాత్రం స్పష్టత లేదనే వాదన కూడా వినిపిస్తోంది.