సీమాంధ్ర నేతల సమైక్య పోరు: బాబుకు తలనొప్పి
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణపై పోలీసులు ఉమామహేశ్వర రావును, మరో నాయకుడు బొండా ఉమా మహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. మాచవరం పోలీసు స్టేషన్లో దేవినేని ఉమ దీక్ష కొనసాగిస్తున్నట్లు తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి గుంటూరు జిల్లా పొన్నూరులో దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు నన్నపనేని రాజకుమారి, కోడెల శివప్రసాద్ రావు సంఘీభావం ప్రకటించారు.
రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు దేవినేని ఉమ ప్రకటించారు. అయితే, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రకటింటే వరకు ఆందోళన సాగుతుందని తెలుగుదేశం నాయకులు వర్ల రామయ్య, కొనకళ్ల ప్రకటించారు. దీన్నిబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డగించడానికే తెలుగుదేశం నాయకులు ఆందోళనలకు దిగుతున్నారనే అభిప్రాయాన్ని వారు కలిగిస్తున్నారు. పైగా, 13 జిల్లాల్లో సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తున్న పార్టీ తమదేనని వర్ల రామయ్య చెప్పుకున్నారు. సీమాంధ్రలోని జిల్లాలను ఉద్దేశించి ఆయన అన్నారనేది అందరికీ తెలిసిన విషయమే.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెసు కన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు తెలంగాణ నాయకుల నుంచి విమర్శలు ఎదుర్కున్నారు. 2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వెనక్కి వెళ్లడానికి కూడా చంద్రబాబే కారణమంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు సమయం చిక్కినప్పుడల్లా దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రస్తుత ఆందోళనలు కూడా చంద్రబాబుకు కష్టాలను తెచ్చి పెట్టే పరిస్థితిని కల్పిస్తున్నాయని అంటున్నారు.