టీ ప్రజలు తిరగబడితే...: విహెచ్పై దాడి మీద హరీష్
సమైక్య ఉద్యమానికి దశాదిశా ఉందా, ఎందుకు ఉద్యమం చేస్తున్నారో మీకు తెలుసా అని ఆయన అడిగారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు. పరస్పరం నిందలు వేసుకుంటూ తెలంగాణ ప్రజలపై ఆ పార్టీలు దాడికి పురికొల్పుతున్నాయని ఆనయ అన్నారు. తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని కోరుకోవడం ఇలాగేనా అని ఆయన అడిగారు. తిరుపతికి తమ వాళ్లు ఎవరూ రావద్దా అని అన్నారు. హైదరాబాదులో సీమాంధ్రుల పట్ల ఎప్పుడైనా తెలంగాణవాళ్లు అలా ప్రవర్తించారా అని హరీష్ రావు అడిగారు.
హనుమంతరావుపై జరిగిన దాడికి సమైక్య ఉద్యమకారులు సమాధానం చెప్పాలని, విహెచ్కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, వాటికి సీమాంధ్ర నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉందామని, రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని తాము అంటున్నామని, కలిసి ఉందామని చెప్పే సీమాంధ్రులే అలా చేస్తే ఎలా అని ఆయన అన్నారు. తమ సహనానికి కూడా హద్దు ఉంటుందని, సహనం హద్దులు దాటితే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని, హద్దులు దాటకూడదనే తాము అనుకుంటున్నామని ఆయన అన్నారు.
పట్టపగలు దోపిడీ
హైదరాబాదులోని అమీర్పేటలో గల ప్రభుత్వ ప్రకృతి వైద్యశాలకు సీమాంధ్రకు చెందిన సాయిరాంను సూపర్వైజర్గా వేస్తూ ఉత్తర్వులు జారీ చేయబోతున్నారని ఆయన చెప్పారు. ఆ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశఆరు. తెలంగాణ ఏర్పడబోయే సమయంలో ఈ చర్య పట్టపగలు దోపిడీ చేయడం లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. సాయిరాం కన్నా 28 మంది సీనియర్లు ఉన్నారని, వారందరినీ కాదని సాయిరాంను సంచాలకుడిగా వేయడం అన్యాయమని ఆయన అన్నారు.
ప్రొఫెసర్ నీరజారెడ్డిని సంచాలకులుగా వేయాలని తెలంగాణకు చెందిన మంత్రులు బస్వరాజు సారయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి సూచించారని, నీరజారెడ్డి అందరికన్నా సీనియర్ అని, మంత్రుల మాటలనూ సీనియారిటీని కాదని సాయిరాంను సంచాలకుడిగా నియమిస్తూ ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి సంతకాలు చేసి ఉత్తర్వులు జారీ చేయబోతున్నారని ఆయన అన్నారు.
ఓ శాఖ అధిపతిగా కూడా సాయిరాంకు అర్హత లేదని గతంలో ట్రిబ్యునల్ తేల్చి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజకీయ పలుకుడి ఉండడం, సీమాంధ్ర వాడు కావడం సాయిరాం అర్హతా అని, తెలంగాణ కాబట్టే నీరజారెడ్డిది అనర్హతా అని ఆయన అడిగారు. ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.