ముంబై లోకల్ రైల్లో అమెరికా మహిళపై దాడి, దోపిడీ
ఆ సంఘటన ఆదివారం సాయంత్రం పశ్చిమ రైల్వేలోని మెరైన్ లైన్స్, చార్నీ రోడ్డు స్టేషన్ల మధ్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి మహిళా కంపార్టుమెంటులోకి ఎక్కి అమెరికా జాతీయురాలు మిచెల్లే మార్క్ సంచీని లాక్కోవడానికి ప్రయత్నించాడు.
ఆమె ప్రతిఘటించడంతో దాడి చేసి ఆమె ఐ ఫోన్ను ఎత్తుకెళ్లాడని పోలీసులు చెప్పారు. ఆ మహిళను తోటి ప్రయాణికులు ముంబై సెంట్రల్ స్టేషనులోని అధికారుల వద్దకు తీసుకుని వెళ్లారు. కాగా, ఆ మహిళకు సహాయం చేయడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సహాయం చేయడానికి నిరాకరించిందని, ఆమె చేతికి, ముఖానికి గాయాలయ్యాయని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
మహిళకు చికిత్స చేయించాల్సిన బాధ్యత రైల్వే ప్రొటెక్షన్ బలగాలది, స్టేషన్ మాస్టర్ది అని ఆయన అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహిళకు చికిత్స చేసి డిశ్చార్జీ చేశారు. దొంగ మత్తుపదార్థాలకు బానిస అయి ఉంటాడని, అతన్ని గుర్తించడానికి సిసిటీవి ఫుటేజీని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.