ఫుట్పాత్పై చెప్పులు కుట్టుకునే వ్యక్తిని కాల్చి చంపారు
పోలీసుల కథనం ప్రకారం - కర్ణాటకలోని బీదర్కు చెందిన పట్టనీకార్ అశోక్ (65) సికింద్రాబాదులోని బేగంపేట ఓల్డు కస్టమ్స్ బస్తీలో నివసిస్తున్నాడు. పదేళ్ల క్రితం అశోక్తో గొడవ పడి భార్య మున్నీ తన ముగ్గురు పిల్లలతో నిజామాబాద్ వెళ్లిపోయింది. ఆ తర్వాత నుంచి అశోక్ హైదరాబాదులోని అమీర్పేట చౌరస్తాలోని ఫుట్పాత్పై చిన్న దుకాణం పెట్టుకుని చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నాడు. సంపాదనంతా మద్యానికే వాడేవాడు. రాత్రిపూట కూడా ఫుట్పాత్పైనే నిద్రించేవాడు.
శనివారం రాత్రి అమీర్పేట లీలానగర్లోని శాంతి శిఖర ఆపార్టుమెంట్స్ సమీపంలోని ఫుట్పాత్పై తన స్నేహితుడు లక్ష్మణ్కు చెందిన చెప్పుల దుకాణం ముందు నిద్రించాడు. తెల్లవారు జామున వాకింగ్ చేస్తూ బయటకు వచ్చిన అపార్టుమెంట్వాసులు అశోక్ రక్తం మడుగులో పడి ఉండడాన్ని గమనించి పోలీసులకు తెలిపారు.
అశోక్ను దుండగులు తుపాకీతో కాల్చినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్ నిపుణులు పాయింట్ 32 క్యాలిబర్ తూటా ఖాళీ కాట్రిడ్జ్ను స్వాధీనం చేసుకున్నారు. తూటా గాయాన్ని బట్టి అశోక్ కూర్చుని ఉండగా దుండగులు వెనక వైపు నుంచి కాల్చినట్లు గుర్తించారు.