కృష్ణుడి గెటప్లో డ్రామాలు: చంద్రబాబుపై అంబటి ఫైర్
విభజన ప్రక్రియపై నిర్ణయం తీసుకోవడానికి ముందు రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెసు నాయకులతో మాట్లాడలేదా అని ఆయన అడిగారు. చంద్రబాబు సమైక్యవాదో, తెలంగాణవాదో, అవకాశవాదో తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సీమాంధ్రలో అడుగుపెట్టే ముందు చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మగౌరవ యాత్ర చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఢిల్లీ పర్యటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు అవకాలు చెబవాకులు పేలుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
చంద్రబాబుకు కాంగ్రెసు నేతలతో ప్రత్యక్ష సంబంధాలున్నప్పుడు అపాయింట్మెంట్ ఎందుకని ఆయన అడిగారు. ఎమ్మెల్సీ పదవి రాక ముందు యనమల రామకృష్ణుడు తమ పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేశారని ఆయన చెప్పారు. రాష్ట్రం రావణకాష్టంలా మారితే చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో చలి కాచుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు చరిత్ర హీనుడైతే, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చరిత్ర వీరుడవుతాడని ఆయన అన్నారు. తెలుగు ప్రజల కోసం జగన్ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు బాడీ లాంగ్వేజ్ తప్ప ఏ లాంగ్వేజ్ కూడా చేత కాదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గాంధీభవన్ను బ్రాందీభవన్గా మార్చిన ఘనత బొత్సదని ఆయన అన్నారు. సమన్యాయం అంటే బొత్స సత్యనారాయణకు ఏం తెలుసునని ఆయన అన్నారు. సమన్యాయం అంటే ఒక ప్రాంతంవారు గెలిచినట్లు మరో ప్రాంతం వారు ఓడినట్లు కాకుండా అందరూ సంతోషంగా విడిపోయేట్లుండాలని ఆయన స్పష్టం చేశారు.