నిలకడగా జగన్ ఆరోగ్యం: జైలు వద్ద ఫ్యాన్స్ హడావుడి
హైదరాబాద్: రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ చంచల్ గూడ జైలులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ వైపు దీక్ష చేస్తుండగా, జైలు సమీపంలో ఆ పార్టీ కార్యకర్తల హడావుడి నాలుగు రోజులుగా కనిపిస్తోంది. మరోవైపు నాలుగు రోజులైనా జగన్ ఆరోగ్యం నిలగడగా ఉందని జైలు అధికారులు చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం బులెటిన్ విడుదల చేయనున్నారు.
సమన్యాయం చేయాలని లేదంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని జగన్ దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షకు మద్దతుగా సంఘీభావం ప్రకటించేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు జైలు వద్దకు తరలి వస్తున్నారు. పలు జిల్లా నుండి ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి విడతల వారిగా కార్యకర్తలు వస్తున్నారు.

దీంతో జైలు అధికారులు ముందస్తుగా జైలు పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జైలు రహదారిని ముళ్ల కంచెతో ముసేశారు. జైలు వద్దకు వస్తున్న వారిని పోలీసులు పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను దూరంలోనే అడ్డుకుంటున్నారు.
ఆ పార్టీ కార్యకర్తలు ఈ రోజు కూడా విడతలవారీగా జైలు వద్దకు వచ్చారు. జైలు పరిసరాల్లోని రోడ్డు పైన నిరసన ప్రదర్శనకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాతబస్తీకి వెళ్లే రహదారిలో ట్రాఫిక్ కాసేపు స్తంభించింది.












Click it and Unblock the Notifications