విభజనపై బాబు మధ్యేమార్గం: ఒకేదారిలో కిరణ్, జగన్
హైదరాబాద్: విభజన విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మధ్యేమార్గంగా వ్యవహరిస్తూ గుంటూరు జిల్లాలో ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు సమైక్యానికే జై అంటున్నారు. విభజన విషయంలో వారి వైఖరి ఆదివారం స్పష్టంగా బయటపడిందని చెప్పవచ్చు.
ఈ రోజు సాయంత్రం కిరణ్ను సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు కలిశారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ వెనక్కి తగ్గకుంటే సీమాంధ్రలో పార్టీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని, తమను ప్రజలు అడ్డుకుంటున్నారని, రాజీనామాలు చేయకుంటే నియోజకవర్గాలలోకి రానివ్వడం లేదని వారు కిరణ్తో చెప్పారు. అయితే, కిరణ్ మాత్రం రాజీనామాల విషయాన్ని పక్కన పెట్టాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

రాజీనామాలు చేయకుంటేనే చట్టసభల్లో తెలంగాణపై తీర్మానాన్ని అడ్డుకోవచ్చునని సూచించారట. కేంద్ర కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ వస్తే సీమాంధ్ర కేంద్రమంత్రులు డీసెంట్ వ్యక్తం చేయాలని, తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెడితే సీమాంధ్ర ఎంపీలు అడ్డుకోవాలని కిరణ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాల కంటే అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకించడం మంచిదని చెప్పారట. ఈ సమయంలో వారు తాము ఈ నెల 3న అసెంబ్లీ ప్రాంగణంలో దీక్ష చేస్తున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.
సిడబ్ల్యూసి నిర్ణయం వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి మాటల్లో సమైక్యవాదం వినిపిస్తోంది. తద్వారా ఆయన సీమాంధ్రలో వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకుంటున్నారని చెప్పవచ్చు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా ఆదివారం తమది సమైక్యవాద పార్టీ అని తేల్చి చెప్పింది. ఇన్నాళ్లు సమన్యాయం వినిపించిన ఆ పార్టీ ఈ రోజు తాము సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. తద్వారా కిరణ్, జగన్లు ఎవరికి వారు సీమాంధ్రలో పోరు సల్పుతున్నారు.
మరోవైపు చంద్రబాబు మాత్రం మధ్యేమార్గంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు అనుకూలమని, సమైక్యాంధ్ర కావాలని చెప్పకుండా ఆయన తన ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించారు. ఇరు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకునే ఉద్దేశ్యంలో భాగంగా ఆయన వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ సెంటిమెంటును గుర్తించి అనుకూలంగా లేఖను ఇచ్చామని చెప్పిన బాబు.. గతంలో తాను సమైక్యాంధ్రను కోరుకున్నానని చెప్పారు. రాజధానిగా ఉన్న ప్రాంతం విడిపోవడం ఎందుకున్న అద్వానీ మాటలను గుర్తు చేస్తున్నట్లు చెప్పారు.
అసలు తెలంగాణను తెరపైకి తీసుకు వచ్చిందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేరులో ఉన్న దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అని, దానికి ఆజ్యం పోసింది కాంగ్రెసు, తెరాస, జగన్లు అని ఆరోపించారు. చిచ్చు పెట్టిన వారే ఒకటై మళ్లీ టిడిపిని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎన్డీయే హయాంలో సమైక్యాన్ని కోరుకున్నానని, సెంటిమెంట్ దృష్ట్యా ఆ తర్వాత లేఖ ఇచ్చానని బాబు ఆత్మగౌరవ యాత్రలో ప్రధానంగా చెప్పేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. తద్వారా ఇరు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరెన్ని చెప్పినా విభజన ఆగదు: డిఎస్
ఎవరెన్ని చెప్పినా విభజన ఆగదని పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్ ఆదివారం అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చీడపురుగులు చేరాయని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణపై తీసుకున్న నిర్ణయం వెనక్కి వెళ్లదన్నారు. పార్లమెంటులో త్వరగా బిల్లు పెట్టేలా ఒత్తిడి తేవాలని మంత్రి జానా రెడ్డి అన్నారు.
అశోక్, తులసి రెడ్డిలపై తెరాస ఫైర్
ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తీరు తీవ్రవాదిలా ఉందని తెరాస ఆరోపించింది. తెలంగాణ ఉద్యమాన్ని గంజాయి మొక్కతో పోల్చిన తులసి రెడ్డి పైన తెరాస మండిపడింది. ప్రయివేటు బస్సుల పైన అశోక్ బాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
కిరణ్ పైన విహెచ్
సీమాంధ్ర ఉద్యోగులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెచ్చగొడుతున్నారని కాంగ్రెసు పార్టీ ఎంపి విహెచ్ మండిపడ్డారు. పైళ్లపై చకచకా సంతకాలు చేస్తున్న సిఎంను తెలంగాణ మంత్రులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
7న సేవ్ ఎపి సభ
ఈ నెల 7వ తేదిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ పేరుతో సభను నిర్వహిస్తున్నట్లు అశోక్ బాబు చెప్పారు. ఉద్యోగులు రూ.10 కూపన్ తీసుకోవాలని, అవి ఉద్యమానికి ఉపయోగపడుతాయన్నారు. పార్టీలు అజెండాలు లేకుండా సమైక్యవాదానికే కట్టుబడి ఉన్న నేతలు సభకు రావొచ్చునన్నారు.












Click it and Unblock the Notifications