నేతలను నడిపిస్తున్నారు: చిరు సమైక్యం, బిల్లుపై జెసి
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర పాలిత ప్రాంతం లాంటి ప్రతిపాదనలేవి లేవని, తమది సమైక్యవాదమేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి బుధవారం న్యూఢిల్లీలో అన్నారు. ప్రజల ఆకాంక్ష, నిర్దేశం మేరకే తాము నడుచుకుంటామని చెప్పారు. సీమాంధ్ర ప్రజలంతా సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారన్నారు. రాజకీయ నాయకులు ప్రజలకు మార్గనిర్దేశం చేసేవారని, ఇప్పుడు ప్రజలే నేతలను నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
బిల్లు ఆమోదం పొందదు: జెసి
పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందదని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు శాసన సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వేరుగా అన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు.

కర్నూలు డిసిసి కార్యాలయంపై గుడ్లు, టమాటాలు
కర్నులు జిల్లా డిసిసి కార్యాలయం పైన సమైక్యవాదులు గుడ్లు, టమాటాలు విసిరారు. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉపాధ్యాయులు కార్యాలయం పైన గుడ్లు, టమాటాలు విసిరారు. వారిని కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు.
ఎపిఎన్జీవోలను కలిసిన తెలంగాణ మాల మహానాడు
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న ఎపిఎన్జీవోలను బుధవారం తెలంగాణ మాలమహానాడు నేతలు కలుసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని, అడ్డుకోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications