నిమ్స్ నుంచి డిశ్చార్జ్: మళ్లీ చంచల్గుడా జైలుకు జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను వైద్యులు నిజాం వైద్య విజ్ఝాన సంస్థ (నిమ్స్) నుంచి డిశ్చార్జ్ చేశారు. బుధవారం రాత్రి ఆయనను డిశ్చార్జీ చేసినట్లు నిమ్స్ వైద్యులు జైలు అధికారులకు తెలిపారు. దీంతో వైయస్ జగన్ను భారీ భద్రత మధ్య నిమ్స్ నుంచి చంచల్గుడా జైలుకు తరలించారు. గత ఐదు రోజులుగా నిమ్స్లో జగన్కు చికిత్స చేశారు.
జగన్ను ఆస్పత్రి నుంచి తరలించే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు హడావిడి చేశారు. పెద్ద యెత్తున వారు నిమ్స్ వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చంచల్గుడా జైలులో నిరాహార దీక్ష చేపట్టిన వైయస్ జగన్ను ఇటీవల తొలుత ఉస్మానియా ఆస్పత్రికి, ఆ తర్వాత నిమ్స్కు తరలించారు. బలవంతంగా ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించి వైయస్ జగన్ దీక్షను భగ్నం చేశారు.

అంతకు ముందు బుధవారం సాయంత్రం వైద్యులు పరీక్షలు జరిపారు. ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, సాధారణ స్థాయికి చేరుకుందని తెలిపారు. ఆయన శరీరంలో కీటోన్స్ సాధారణ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. బిపి, షుగర్, సోడియం నిల్వలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. అయితే, వారం రోజుల పాటు దీక్ష చేసిన కారణంగా నరాలు ఇంకా బలహీనంగా ఉన్నాయని, ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సి వచ్చినప్పుడు కష్టంగా ఉందని తెలిపారు.
హిమోగ్లోబిన్(రక్తం) ఇంకా మెరుగు పడాల్సి ఉందన్నారు. పండ్లు, పండ్ల రసాలు, ఘన పదార్థాలు తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుదల వేగంగా ఉంటుందని వైద్యులు చెప్పారు. పలువురు పార్టీ నేతలు నిమ్స్కు వచ్చి వైద్యులను జగన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్ సతీమణి భారతి బుధవారం సహాయంగా ఉండేందుకు ఆసుపత్రికి వచ్చారు. ఉదయం ఎనిమిది గంటలకు వచ్చిన ఆమె సాయంత్రం వరకు ఉండి వెళ్లారు.












Click it and Unblock the Notifications