జగన్అంటే భయం, హైద్రాబాద్పై మాట్లాడే హక్కు: బాబు
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దోపిడీ వ్యవహారంతో పారిశ్రామికవేత్తలు భయపడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా భయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆరోపించారు. ఇటలీ, ఇడుపులపాయకు సంబంధముందన్నారు. బాబు ఆత్మగౌరవ యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఏకమయ్యారన్నారు. పిల్లి కళ్లు మూసుకోని పాలు తాగిన చందంగా సోనియా రాష్ట్రం పట్ల వ్యవహరిస్తే జనం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ బలపడిందనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెసు విభజన కుట్రకు తెరలేపిందన్నారు.

ఉత్తర ప్రగల్భాలు పలికిన షర్మిల, విజయమ్మలు జగన్ బెయిల్ కోసం సోనియా కాళ్ల వద్ద కూర్చుంటున్నారని విమర్శించారు. సోనియాకు తమపై కోపం ఉంటే టిడిపి పైనే తీర్చుకోవాలని, తెలుగు జాతి విచ్ఛిన్నానికి కుట్ర చేస్తే తగిన బుద్ధి చెబుతామన్నారు. 35 రోజులుగా సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.
సాగునీరు, ఉద్యోగాలపై సీమాంధ్రలో ఆందోళనలు ఉన్నాయన్నారు. ఓట్లు, సీట్ల కోసమే సోనియా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. తెలుగుజాతిని వల్లకాడు చేసి మొద్దబ్బాయిని ప్రధానమంత్రిని చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెసు పార్టీని టిడిపి శంకరగిరి మాన్యాలు పట్టించిందని, తెలుగు జాతితో పెట్టుకుంటే మరోసారి తప్పదన్నారు.
కాంగ్రెసు పార్టీని తాను వదిలే ప్రసక్తి లేదన్నారు. తనకు ప్యాకేజీలు, బెయిళ్లు అవసరం లేదన్నారు. తెలుగు జాతి కలిసుండటమే కావాలని చెప్పారు. హైదరాబాదు గురించి మాట్లాడే హక్కు తనకుందన్నారు. కాంగ్రెసు పార్టీ ఆడిస్తుంటే... వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు ఆడుతాయన్నారు.












Click it and Unblock the Notifications