హైదరాబాద్ వదులుకోం, నోట్ ఇప్పట్లో లేదు: కావూరి
తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు ఇప్పట్లో రాదని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేశానికి వచ్చాక సీమాంధ్ర ఉద్యమానికి అనుకూలంగా ప్రకటన వస్తుందని తెలిపారు. సీమాంధ్ర ఉద్యమ న్యాయమైనదని, సీమాంధ్ర ప్రజల సెంటిమెంటును కాంగ్రెస్ అధిష్టానం అర్థం చేసుకుంటోందని తెలిపారు.
సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఆ ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలతో కలిసి కాంగ్రెస్ అధిష్టానం ముందు సమైక్యవాదం వినిపించినట్లు కావూరి తెలిపారు. త్వరలో ఆంటోని కమిటీ హైదరాబాదుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
కోదండరాంపై టీడీపీ మండిపాటు
తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరాం రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు అన్నారు. శుక్రవారం మీడియాతో టీడీపీ ఎంపీలు మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఇరు ప్రాంత ప్రజల అంగీకారంతోనే జరగాలని చెప్పారు. కోదండరాం ప్రొఫెసర్లా మాట్లాడాలని కొనకళ్ల నారాయణ అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి స్వార్థ రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవని నిమ్మల కిష్టప్ప అన్నారు. రాజకీయ ప్రయోజనం కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీస్తోందని అన్నారు. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో తీవ్ర ఉద్యమం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు.
సీమాంధ్ర ఉద్యమంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మోదుగుల వేణుగోపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందే ఇలా ఉంటే ఆ తర్వాత ఎలా ఉంటుందోనని మోదుగుల పేర్కొన్నారు. శనివారం నిర్వహించనున్న ఏపీ ఎన్జీవోల సభకు మద్ధతు పలుకుతున్నట్లు మరో ఎంపీ సీఎం రమేష్ అన్నారు.
హైకోర్టులో పరిణామాలు విచారకరం: ఏరాసు
న్యాయవాదులు సంయమనం పాటించాలని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ హైకోర్టులో జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమస్యపై ఇరు ప్రాంతాల పెద్దలు చర్చలు జరిపాలని, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారమవుతుందని ఆయన చెప్పారు. సభలు, సమావేశాలు జరుపుకోవడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసాంఘిక శక్తుల వల్ల సామాన్య ప్రజానీకానికే నష్టమని ఏరాసు అన్నారు.