టెన్షన్: సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు, తెలంగాణ బంద్
హైదరాబాద్: ఎపి ఎన్జీవోలు రేపు శనివారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు, తెలంగాణ జెఎసి తలపెట్టిన 24 గంటల తెలంగాణ బంద్ నేపథ్యంలో హైదరాబాదులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎపిఎన్జీవోల సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఉద్యోగులు మాత్రమే సదస్సులో పాల్గొనాలని, గుర్తింపు కార్డులు చూపించిన వారిని మాత్రమే అనుమతించాలని హైకోర్టు షరతులు పెట్టింది.
ఎల్బీ స్టేడియంలో సభ ఏర్పాట్లను ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు శుక్రవారం సాయంత్రం పర్యవేక్షించారు. సభ ఆవరణకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. సభా వేదికకు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల పేరు పెట్టారు. ఎల్బీ స్టేడియంలోకి ప్రవేశించడానికి నాలుగు గేట్లు పెట్టారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎనిమిది చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈ చెక్ పాయింట్ల వద్ద ఉద్యోగుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తారు.
సీమాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాదుకు తరలి వస్తున్నారు. సభ విజయవంతం కావాలని సీమాంధ్ర రాజకీయ నాయకులు ఆకాంక్షించారు. వేదిక సాంస్కృతిక వేదికకు గురుజాడ పేరు పెట్టారు. ఎల్బీ స్టేడియం వద్ద 3 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. సభకు రాజకీయ నాయకులను అనుమతించడం లేదు.
కాగా, తెలంగాణ జెఎసి శుక్రవారం అర్థరాత్రి నుంచి తెలంగాణ బంద్ పాటించింది. ఎపి ఎన్జీవోల సదస్సుకు పోలీసులు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జెఎసి బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మద్దతు ఇస్తోంది. రేపటి బంద్ను విజయవంతం చేయడానికి తెరాస కూడా కసరత్తు చేస్తోంది. ఎపి ఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వడంపై తెరాస నాయకులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ తీవ్రంగా మండిపడ్డారు.
తెలంగాణకు సీమాంధ్ర ప్రాంతాల నుంచి ప్రవేశించే మార్గాలను పోలీసులు తనిఖీలు చేశారు. సీమాంధ్ర నుంచి వాహనాల్లో, రైళ్లలో ఉద్యోగులు హైదరాబాదు ఇప్పటికే తరలి వస్తున్నారు. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరట ఎల్బీస్టేడియంలో ఏపీఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభకు విశాలాంధ్ర మహాసభ పూర్తి సంఘీభావం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమైక్యాంధ్రను కోరుకునేవారు ఉన్నారని, వారు అందరూ భయం, సందేహాలు లేకుండా ధైర్యంగా ఎల్బీస్టేడియం ప్రాంగణంవరకైనా వచ్చి సభకు తమ మద్దతు తెలపాలని కోరింది. ఉద్యోగులసభ అయినప్పటికీ ఎల్బీస్టేడియం ప్రాంగణంవరకు వచ్చి సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసింది.
కుట్రలకు, కుతంత్రాలకు వ్యతిరేకంగా పిలుపిచ్చిన రేపటి బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ జేఏసీ తెలంగాణ వాదులకు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం తెలంగాణ పొలిటికల్ జేఏసీ సమావేశమై పలు తీర్మానాలు చేసింది. రేపు ఎలాంటి పరిణామాలు జరిగినా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిదే బాధ్యత అని టీ జేఏసీ హెచ్చరించింది.
ఏపీ ఎన్జీవోల సభ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, సభ ఏర్పాటులో అనేక కుట్రలున్నాయని, ఏపీ ఎన్జీవోల సభకు ఎవరూ హాజరు కావద్దని, బంద్లో అత్యవససర సేవలకు మినహాయింపు ఇవ్వాలని టీ జేఏసీ పేర్కొంది. తెలంగాణవాదులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని టీ జేఏసీ విజ్ఞప్తి చేసింది.