హైకోర్టు వద్ద టెన్షన్: టిVsసీమాంధ్ర, లాయర్ల దాడులు
హైదరాబాద్: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. న్యాయస్థానం ప్రాంగణంలో తెలంగాణ, సీమాంధ్ర న్యాయవాదులు పోటా పోటీగా నినాదాలు చేశారు. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ రోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు సీమాంధ్ర న్యాయవాదులు హైకోర్టు ప్రాంగణంలో మానవ హారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో తెలంగాణ న్యాయవాదులు న్యాయస్థానం వద్ద శాంతి ర్యాలీకి ప్లాన్ చేసుకున్నారు. ఇరువర్గాలు నినాదాలు హోరెత్తించాయి. ఇరు వైపుల న్యాయవాదులు తెలంగాణకు, సమైక్యాంధ్రకు అనుకూలంగా పోటా పోటీ నినాదాలు చేశారు.
న్యాయవాదులు పరస్పరం దాడులు ఫోటోలు
ఓ సమయంలో ఘర్షణకు దిగారు. అంతేకాదు న్యాయవాదులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. పలువురు న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు గంటన్నర ఉద్రిక్తత తర్వాత పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు రాగలిగారు.
తాము ర్యాలీకి అనుమతి తీసుకొని నిరసన తెలుపుతున్నామని సీమాంధ్ర న్యాయవాదులు చెబుతుండగా, ర్యాలీలకు ఆందోళనలకు పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలంగాణ న్యాయవాదులు చెబుతున్నారు. మరోవైపు తమపై దౌర్జన్యం చేశారంటూ ఇరు ప్రాంతాల న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తికి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.