అకాల వర్షం: ఏజెన్సీ అన్నదాతల ఆందోళన.. చలిగాలులు
తెలంగాణ రాష్ట్రంలో చలిగాలులు వీస్తున్నాయి. అసలే చలికాలం.. ఆపై గాలులతో అంతా వణుకుతున్నారు. సంక్రాంతి ముందు చలి కూడా ఎక్కువే ఉంటుంది. శని, ఆది, సోమవారం వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ సంచాలకులు పేర్కొన్నారు. ఇటు తుఫాన్ ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండురోజుల నుంచి అకాల వర్షం కురుస్తోంది.
బోథ్ నియోజకవర్గంలో గల అన్ని మండలాల్లో ఉరుములు మెరువులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్లో పంట చేతికి వచ్చే సమయంలో అత్యధిక శాతం వర్షాలతో పంట దిగుబడి లేక నష్టపోతే ఈ రబీ సీజన్లో సైతం ఈ అకాల వర్షాలు వదిలిపెట్టడం లేదు. చేతికొచ్చే మొక్క జొన్న, వేరుశనగ పంటలు కోతకు, పూతకు రావడంతో వర్షాలతో పూత రాలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షాలతో కూరగాయలు, ఆకుకూరలకు తెగుళ్లు వచ్చి పాడయ్యే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు. గుడిహత్నూర్ మండలానికి చెందిన రైతు విజయ్ కూడా తాను వేసిన పంటలు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. ఒక పక్క చలి, ఎండ, వానాకాలం రావడంతో చాలా ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తోంది. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులు తమ తమ ఇళ్లల్లో హ్యాపీగా గడపడానికి వెళ్లినా వర్షాలతో ఎంజాయ్ చేయకుండా పోయిందని అటు విద్యార్థులు కూడా నిరాశ చెందుతున్నారు.
మరో వైపు ఉత్తరభారతాన్ని మంచుదుప్పటి కమ్మేసింది. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాష్ట్రాల్లో భారీ హిమపాతం నమోదు అయింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి వాతావరణం ఉంది. చలిగాలులు వీయడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆస్తమా ఉన్నవారు అయితే ఇంటి నుంచి బయటకు రావడం లేదు. చలిగాలుల తర్వాత కాసేపు ఎండ వచ్చిన జనం సంతోష పడుతున్నారు. కానీ ఆ వెంటనే మబ్బులు వచ్చి.. చల్లని వాతావరణం ఉంది. దీంతో ఊసురుమనడం వారి వంతవుతుంది.