ఏపీలో 349 కరోనా కేసులు..: ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతూ.. తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,054 కరోనా పరీక్షలు నిర్వహించారు. 349 మందికి పాజిటివ్ వచ్చింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 67 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 48, పశ్చిమ గోదావరిలో 45, గుంటూరు జిల్లాలో 43 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా రెండు పాజిటివ్ కేసులను గుర్తించారు. అదే సమయంలో 535 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,66,065 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,47,047 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,649 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,369కి పెరిగింది.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.