రాష్ట్రానికి మూడు బిలియన్ డాలర్లు: పోర్టులు.. ఎయిర్పోర్టులు: మౌలికరంగానికి ఊతం..!
అమరావతి: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన రంగానికి మరింత ఊతం ఇవ్వడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎత్తున రుణాలను అందించడానికి ఆసియా మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ) ముందుకొచ్చింది. మూడు బిలియన్ డాలర్ల మేర మొత్తాన్ని రుణ రూపంలో అందించడానికి అంగీకరించింది.

మౌలిక రంగాన్ని బలోపేతం చేసేలా..
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణం, రహదారుల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఈ నిధులను వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కంది. ఏఐఐబీ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రితో నిర్వహించిన సమావేశం అయ్యారని, ఈ సందర్భంగా రాష్ట్రానికి రుణాలను ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారని చెప్పారు.

ఏఐఐబీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ..
ఏఐఐబీ ఉపాధ్యక్షుడు, పెట్టుబడుల విభాగం ముఖ్య కార్యనిర్వహణాధికారి పాండియన్, బ్యాంకు డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) లీ ఎన్ పాంగ్, సోమనాథ్ బసు తదితరులు సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఆర్థికశాఖ ముఖ్య సలాహాదారు అజేయ కల్లం, పీవీ రమేష్, షంషేర్ సింగ్ రావత్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయని తెలిపింది.

కొత్త ప్రాజెక్టుల గురించి ఆరా..
రాష్ట్రంలో కొత్తగా నిర్మించ తలపెట్టిన ఓడరేవుల గురించి ముఖ్యమంత్రి ఏఐఐబీ ప్రతినిధుల బృందానికి వివరించారు. శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నంలో ఓడరేవులను నిర్మించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని అన్నారు. ఈ మూడింట్లో ఒక ఓడరేవును అభివృద్ధి చేయడానికి తాము నిధులను మంజూరు చేస్తామని ఏఐఐబీ ప్రతినిధులు వెల్లడించారు.

రోడ్లు, విమానాశ్రయాల కోసం..
భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి వివరించగా.. దానికి నిధులను మంజూరు చేస్తామని ప్రతినిధులు పేర్కొన్నట్లు ఈ ప్రకటనలో తెలిపారు. నీటి ప్రాజెక్టులు, రోడ్లు, వాటర్ గ్రిడ్ వంటి పథకాలకు తామిచ్చే నిధులను బదలాయించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించుకున్న ప్రాధాన్యతలకైనా తమ సహాయం ఉంటుందని ఏఐఐబీ అధికారులు స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications