తీపికబురు: ఆ ఫ్యామిలీస్కు కారుణ్య నియామకాలకు ఓకే.. జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
కరోనా పలు కుటుంబాల్లో విషాదం నింపింది. చాలా కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయాయి. ఇంటిని పోషించే వారు చనిపోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య నియామకాలకు అనుమతి ఇచ్చారు. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కరోనాతో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆ కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వనుంది. సామాజిక భద్రత కల్పన చర్యగా మృతి చెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన ఉద్యోగం లేదా అంతకంటే తక్కువ స్థాయి హోదాతో పోస్టు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టంచేసింది.
అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి నియమించాలి కోరింది. కొందరిని గ్రామ/వార్డు సచివాలయాల్లో నియమించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Recommended Video
అంతకుముందు పవన్ కల్యాణ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున మొబైల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు.కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో పాటించిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో రాత్రి వేళ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధాలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు ప్రస్తుత తరుణంలో వాంఛనీయం కాదని అభిప్రాయపడ్డారు. కరోనా ఉధృతి తగ్గే వరకు తరగతులను వాయిదా వేయవలసిందిగా కోరుతున్నామని పేర్కొన్నారు. పిల్లలకు వాక్సినేషన్ పూర్తికాకపోవడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. క్లిష్ట తరుణంలో మద్యం దుకాణాలను మరో గంటపాటు అదనంగా తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని వెల్లడిస్తోందన్నారు.