చట్ట విరుద్దంగా జరగొద్దు.. చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ: ఏపీ హైకోర్టు
ఉద్యోగుల సమ్మెకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మన్మథరావు బెంచ్ పిటిషన్ను విచారించింది. ప్రభుత్వ ఉద్యోగుల ర్యాలీ, పెన్ డౌన్, సమ్మెపై ఏపీ హైకోర్టు కామెంట్ చేసింది. చట్టానికి విరుద్ధంగా ఏం జరిగినా దాన్ని నివారించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. ఎలాంటి చర్యలైనా తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని చెప్పింది.
పెన్ డౌన్ అయినా సమ్మె అయినా.. అలాంటి కార్యక్రమం ఏం చేసినా రూల్ 4 కింద నిషేధం ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకి తెలిపారు. అలాంటప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా? అని హైకోర్టు అడిగింది. పరిపాలన సవ్యంగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించలేకపోతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.

గురువారం విజయవాడలో జరిగిన ర్యాలీపైనా కోర్టు ప్రశ్నించింది. ఉద్యోగుల ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఏజీ తెలిపారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చూడాలి కదా? అని హైకోర్టు వ్యాఖ్యానించింది. సోమవారం నాటికి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తామని హైకోర్టు తెలిపింది.
పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఇప్పటికే చలో విజయవాడ నిర్వహించిన ఉద్యోగులు.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. శనివారం పెన్ డౌన్ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. పీఆర్సీ జీవోలను వెన్కకి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుండగా, అది కుదరదని ప్రభుత్వం అంటోంది.
ఫిబ్రవరి 6 నుంచి సమ్మె ఖాయం అని ఉద్యోగులు అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో సీఎం జగన్ మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీకి మంత్రులు బొత్స సత్య సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందజేయడం తెలిసిందే.












Click it and Unblock the Notifications