Severe Rainfall Alert:ఏపీకి మళ్లీ వాన గండం, 2 రోజులు.. స్కూళ్లకు సెలవులు
మళ్లీ వానలు కురుస్తోన్నాయి. ఏపీలో అయితే వాన అంటే జనం భయపడే పరిస్థితి నెలకొంది. వారం కింద కురిసిన వర్షాలతో రాయలసీమ, దక్షిణ కోస్తా ఇంకా కోలుకోలేదు. ఇంతలో మరో వానగండం వచ్చిపడింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వాన ముప్పు పొంచి ఉండటంతో రాయలసీమ, కోస్తా ప్రజలంతా.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
భారీ వర్షాలు..
రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలను వర్షం వదలట్లేదు. నెల వ్యవధిలో రెండు సార్లు అతి భారీ వర్షాలతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలు కోలుకోవడం లేదు. నెల్లూరు, కడప జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో.. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే హెచ్చరికలు ఉన్నాయి. 7 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఈదురుగాలులు
దక్షిణ కోస్తా తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉంది. దీంతో డిసెంబర్ 1 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. కోస్తా జిల్లాలకు తుపాను గండం పొంచి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో 2, 3 రోజుల్లో.. తుపానుపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. అల్పపీడనం మరింత బలపడితే.. డిసెంబర్ 4, 5వ తేదీకల్లా.. తుపాను మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
స్కూళ్లకు సెలవులు
సోమవారం తిరుపతిలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో తిరుపతిలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. టీటీడీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. భారీవర్షం కురిస్తే ఘాట్రోడ్లో వాహనాలను నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి. కడప సమీపంలోని ఊటుకూరు చెరువుకు గండి పడింది. దీంతో అధికారులు వెంటనే మరమ్మత్తులు చేపట్టారు. చెరువు కట్ట తెగితే.. కడపలోని 44, 45, 46 డివిజన్లు మునిగే ప్రమాదం ఉంది. భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
వరికోతల సమయంలో
గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇటు గత 15రోజులుగా తమిళనాడు నగరం భారీవర్షాలతో అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పటికీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ముంపులో ఉన్నాయి. చెన్నైలోని చాలా కాలనీలు పూర్తిగా జలదిగ్బంధం నుంచి కోలుకోలేదు. ఈ సమయంలో మరోసారి వానగండం పొంచి ఉండటంతో తమిళనాడు వాసులు టెన్షన్ పడుతున్నారు.