రాజధాని తరలింపు... హైకోర్టు కీలక నిర్ణయం... సీఎం జగన్,మంత్రివర్గానికి నోటీసులు....
రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్, మంత్రులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే టీడీపీ, బీజేపీలకు కూడా నోటీసులు జారీ చేసింది. రాజధాని విషయంలో ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరించిందని రైతులు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా... అధికారంలోకి వచ్చాక మరోలా మాట మార్చారని ఆరోపించారు. తమకు అన్యాయం చేసినందుకు ముఖ్యమంత్రి,మంత్రులు,రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నోటీసులు జారీ చేసింది.
రాజధాని తరలింపు,దానికి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లన్నింటిపై వచ్చే నెల 21 నుంచి రోజువారీ విచారణ చేపడుతామని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై న్యాయవాదులతో చర్చించిన కోర్టు... భౌతిక దూరం,ఫేస్ మాస్కులు,తదితర జాగ్రత్తలు పాటిస్తూ విచారణ జరిపేందుకు సిద్దమని తెలిపింది. మరోవైపు కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న గెస్ట్ హౌజ్ హైకోర్టు నిర్ణయాన్ని ధిక్కరించడమేనని నితీశ్ గుప్తా అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు వచ్చేంతవరకు యదాతథ స్థితిని కొనసాగించాల్సి ఉన్నప్పటికీ... ప్రభుత్వం మాత్రం అతిథి గృహానికి శంకుస్థాపన చేసిందని కోర్టుకు వెల్లడించారు.
పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించడంలో భాగంగానే ఆ గెస్ట్ హౌజ్ నిర్మాణాన్ని తలపెట్టారని న్యాయవాది నితీశ్ గుప్తా పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆ వాదనను ఖండించింది. అది కేవలం వీవీఐపీల కోసం నిర్మిస్తున్న గెస్ట్ హౌజ్ అని స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబర్ 10 లోపు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.