జగన్ హవా, పవన్ కళ్యాణ్ దెబ్బ సహా..: చంద్రబాబు ముందున్న సవాళ్లివే!
అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు.. కొద్ది నెలల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వీరి పొత్తు చిత్తు అయింది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ ఎన్నికలను టీడీపీ, వైసీపీ, జనసేనలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
అధికారం నిలబెట్టుకునేందుకు టీడీపీ, ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ, జనసేనాని చక్రం తిప్పే పరిస్థితి ఏర్పడాలని జనసేన కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు ఎంతో ఆసక్తిని రేపుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ అవి నామమాత్రమే.

ఒత్తిడిలో టీడీపీ
ఇటీవల వరుసగా టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారు. మేడా మల్లికార్జున రెడ్డి, అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్, రవీంద్రబాబు, దాసరి జైరమేష్ వంటి కీలక నేతలు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీని వీడీ వైసీపీలో చేరుతున్నారు. ఇది టీడీపీని ఒత్తిడిలోకి నెట్టింది. టీడీపీ మునిగిపోతున్న నావ అని గుర్తించి వారు వైసీపీలో చేరారని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, చంద్రబాబుపై వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించనుందని, దీనిని గుర్తించే వారు తమ పార్టీలో చేరారని వైసీపీ కేడర్ చెబుతోంది. వరుస చేరికలతో టీడీపీ ఒత్తిడిలో ఉంటే, వైసీపీలో మాత్రం ఉత్సాహం కనిపిస్తోంది. మరో విషయమేమంటే జగన్ ఇటీవల పాదయాత్ర పూర్తి చేశారు. పాదయాత్ర తర్వాత ఈ చేరికలు వైసీపీకి మరింత బలం అంటున్నారు.

ఏపీలో పొత్తులు
2014లో టీడీపీ, బీజేపీలు, జనసేనలు కలిశాయి. జనసేన పోటీ చేయకపోయినప్పటికీ ఆ రెండు పార్టీల కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. మూడు పార్టీలు కలిసినప్పటికీ.. టీడీపీ 103, వైసీపీ 67 సీట్లు గెలుచుకున్నప్పటికీ.. మొత్తంగా ఓటింగ్ శాతం చూస్తే మాత్రం తక్కువ ఓట్లతోనే వైసీపీ ఓడిపోయింది. ఇదే విషయాన్ని జగన్ పదేపదే గుర్తు చేస్తుంటారు. కేవలం ఐదు లక్షల ఓట్లతోనే వైసీపీ ఓడిపోయిందని చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీలు ఒంటరిపోరుకు దిగుతున్నాయి. వైసీపీ గతంలో వలె ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇది వైసీపీకి లాభమని అంటున్నారు. టీడీపీ నుంచి పలువురి చేరిక, 2014 సమీకరణాలు, ప్రభుత్వ వ్యతిరేకత.. ఈ పరిణామాలు చూస్తే వైసీపీకి అనుకూలంగా ఉందని అంటున్నారు. ఇక, ఎన్నికలకు ముందు టీడీపీ, వైసీపీలు పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నాయి. గతంలోఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదని విపక్షాలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి.

టీడీపీకి ఇది కూడా భయం
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న మరో ముఖ్యమైన భయం కాపు ఓటర్లు అని చెబుతున్నారు. ఏపీలో కాపు ఓటర్లు 17 శాతం వరకు ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతివ్వడంతో మెజార్టీ ఓట్లు టీడీపీకి పడ్డాయి. ఇప్పుడు పవన్ ఒంటరిపోరుకు దిగుతున్నారు. ఇది టీడీపీకి అతిపెద్ద దెబ్బ అని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, ఎన్నికల్లోని హామీలు, నేతలు ఇతర పార్టీలలో చేరడం వంటి దెబ్బలతో పోలిస్తే ఇదే అతిపెద్ద దెబ్బ కానుందని భావిస్తున్నారు.

కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ
కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల హామీను అమలు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించాయి. ఇందులో నుంచి ఐదు శాతం రిజర్వేషన్లు కాపులకు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కాపులు ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్ల నుంచి ఇవ్వడాన్ని ప్రశ్నించడంతో పాటు, ఇది అగ్రవర్ణాల మధ్య గొడవకు దారి తీసేలా ఉందనే వాదనలు కూడా వినిపించాయి.

టీడీపీ అలా టార్గెట్
ఏపీలో తనకు ప్రత్యర్థిగా ఉన్న జగన్ పైన టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. మోడీ ఆడించినట్లుగా ఆయన ఆడుతున్నారని విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ -జగన్ - మోడీ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఏపీలో ముఖ్యంగా టీడీపీ వర్సెస్ బీజేపీ, టీడీపీ వర్సెస్ వైసీపీగా అన్నట్లుగానే కనిపిస్తోంది. పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications