జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం.. ఉద్యోగాలేవీ.. నాదెండ్ల మనోహర్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ తప్పుపట్టారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2ల్లో భర్తీ చేసేది కేవలం 36 పోస్టులా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. డీఎస్సీ గురించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ వాలంటీర్లది స్వచ్ఛంద సేవ అని చెప్పిన జగన్.. ప్రచారం కోసం ఉద్యోగాలని చెబుతున్నారని ధ్వజమెత్తారు. శాఖల వారీగా ఉన్న ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందు ఏపీపీఎస్సీ ద్వారా 2 లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన వైసిపి- అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మాట మార్చిందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ కోసం పలు ముహూర్తాలు మార్చి.. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లారని అన్నారు. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ అని ఎన్నో తేదీలు మార్చారని దుయ్యబట్టారు. లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని మేనిఫెస్టోలో చెప్పిన వైసీపీ.. చివరికి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2ల్లో కేవలం 36 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చూపించిందని విమర్శలు గుప్పించారు.
హామీ లక్షల్లో ఇచ్చి భర్తీ మాత్రం నామమాత్రంగా చేస్తామనడం ద్వారా ప్రభుత్వానికి జాబ్ క్యాలెండర్ ప్రకటనలో ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదు అని అర్థమవుతుందని నాదెండ్ల పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయదగ్గ ఉద్యోగాలు ప్రతి ఏటా భారీగా ఖాళీ అవుతున్నాయన్నారు. ఆ లెక్కలను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి సంబంధించి డీఎస్సీ గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
2.59 లక్షల గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు భర్తీ చేశాం అని గొప్పలు చెప్పుకుందన్న ఆయన.. ఇదే వాలంటీర్లు తమకు జీతాలు పెంచాలని ఆందోళనకు సిద్ధమైతే మీవి ఉద్యోగాలు కావు స్వచ్ఛంద సేవ మాత్రమే అని స్వయంగా జగన్ ప్రకటించారని నాదెండ్ల గుర్తు చేశారు. ఆర్టీసీలో 51 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ సంస్థ ప్రభుత్వంలో విలీనం అయ్యేనాటికి ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా వైసిపి వాళ్ళు నియమించినట్లు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.