2019 ఎన్నికలు.. పైగా దశమి: జనసేన ఆఫీస్కు పెద్ద ఎత్తున ఆశావహుల క్యూ
అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల నుంచి దాదాపు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. కొన్ని స్థానాల్లో మాత్రమే ఆయా పార్టీలకు ఇబ్బందులు రానున్నాయి. మరోవైపు, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో మాత్రం అభ్యర్థుల ఖరారు గురించి ఎలాంటి ప్రకటన కనిపించడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోను అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి వేగం లేదని జనసైనికులు ఆందోళనలో ఉన్నారు.
ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసిన స్క్రీనింగ్ కమిటీ
కానీ, ఇప్పటికే పవన్ కళ్యాణ్ నియమించిన స్క్రీనింగ్ కమిటీ ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోకసభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల స్క్రీనింగ్ కమిటీకి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ సభ్యుల వద్దకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి.
ఆశావహుల క్యూ
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున బరిలోకి దిగదలిచిన వారు చాలామంది తమత తమ దరఖాస్తులను అందించారు.. అందిస్తున్నారు. ఆశావహుల బయోడేటాల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలోని ఏపీ రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మాదాసు గంగాధరం, అర్హంఖాన్, హరిప్రసాద్, మహేందర్ రెడ్డిలు శుక్రవారం ఉదయం పది గంటల నుంచి అభ్యర్థుల బయోడేటాలను పరిశీలించడం ప్రారంభించారు.

పవన్ కళ్యాణ్ సూచనల మేరకు..
దశమి మంచి రోజు కావడంతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఆశావహులు జనసేన పార్టీ కార్యాలయానికి తరలి వచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటు బరిలోకి దిగే ఆశావహుల సంఖ్య వందల సంఖ్యలో ఉంది. దీంతో పార్టీ కార్యాలయం ఉదయం నుంచే కిటకిటలాడింది. స్క్రీనింగ్ కమిటీ ప్రతి ఒక్కరి దరఖాస్తును సునిశితింగా పరిశీలిస్తోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనలకు అనుగుణంగా పని చేస్తోంది. ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో స్క్రీనింగ్ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications