రఘురామ రియాక్షన్: సవాల్ స్వీకరిస్తున్నా, కానీ.. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, ఆ షరతు
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి విసిరిన సవాల్ స్వీకరిస్తున్నానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. అయితే దానికంటే ముందు ఒక సవాల్ విసురుతున్నానని చెప్పారు. ఎంపీ పదవీకి రాజీనామా చేసి.. తిరిగి పోటీ చేయాలని పెద్దిరెడ్డి ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి రఘురామ స్పందించారు. కానీ అంతకన్నా ముందే ఒక షరతు విధించారు.
ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారా..
తాను రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని హాట్ కామెంట్స్ చేశారు రఘురామ. అంతేకాదు తిరిగి ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని సూచించారు. అప్పుడు మాత్రమే తాను పెద్దిరెడ్డి సవాల్కు సిద్ధం అని తెలిపారు. తన కాళ్లు పట్టుకొని బతిమాలితే జగన్ పార్టీలో చేరానని గుర్తుచేశారు. తాను సీఎం అయితే అన్న మాటల వెనుక ఉద్దేశం ఏంటో చెప్పాలని పెద్దిరెడ్డిని అడిగారు. ఇప్పుడున్న సీఎం అసమర్థుడా? చెప్పాలని అడిగారు.
చంద్రబాబును విమర్శించే స్థాయి కాదు
చంద్రబాబుకు బంట్రోతుగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయంగా చంద్రబాబు తనకు ఉన్నత స్థానం ఇచ్చారని రఘురామ గుర్తుచేశారు. చంద్రబాబును విమర్శించే స్థాయి పెద్దిరెడ్డికి లేదని.. తన గెలుపునకు వైఎస్ విజయమ్మ, షర్మిల, జగన్ ఫొటోలు ఉంటే వ్యక్తిగత ఇమేజ్ కూడా తోడయ్యిందన్నారు. సీఎం జగన్ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టంచేశారు. ప్రభుత్వ పాలసీలను, విధానాలను, తప్పుచేస్తున్న వారిని మాత్రమే విమర్శించానని చెప్పారు.
వారి దయతో మంత్రివి అయ్యి..
జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి దయతో మంత్రి అయ్యావని.. ఇసుక ద్వారా ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నావో ప్రజలకు తెలుసు అని రఘురామ కృష్ణంరాజు అన్నారు. అంతకుముందు పోలవరం గురించి అమిత్షాతో సీఎం జగన్ మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉంది అని రఘురామ అన్నారు. ఇది కాక ఇంకే అంశాలపై మాట్లాడారో బయటపెట్టాలని.. సీఎం అంటే పెద్ద పాలేరు. అంటే పెద్ద పాలకుడు. అంతేగానీ 'గ్రేట్మ్యాన్' అనుకుంటున్నారా? ప్రజల దాక్షిణ్యాలతోనే సీఎం అయ్యారనే వాస్తవం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. రాజధాని విశాఖలో రావాలన్నా, సీమ సస్యశ్యామలం కావాలన్నా.. పోలవరం అవసరం అని రఘురామ అభిప్రాయపడ్డారు.