రూల్ 71 అంటే?: టీడీపీకి దొరికిన బ్రహ్మాస్త్రం: గురి తప్పని వైనం: జగన్ దూకుడుకు బ్రేక్.. !
అమరావతి: రూల్ 71. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న దూకుడు వైఖరిని అడ్డుకట్ట వేయడానికి తెలుగుదేశం పార్టీకి దొరికిన ఏకైక బ్రహ్మాస్త్రం ఇది. ప్రస్తుతం దీన్నే ప్రయోగించింది టీడీపీ. ఈ బ్రహ్మాస్త్రం గురి తప్పలేదు. లక్ష్యాన్ని ఛేదించింది. దీని ఫలితం- ఏపీ వికేంద్రీకరణ చట్టానికి శాసన మండలిలో బ్రేక్ పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో- కీలక, చారిత్రక నిర్ణయాన్ని తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది జగన్ సర్కార్.

రూల్ 71తో అడ్డుకట్ట..
మంగళవారం ఉదయం శాసన మండలి సమక్షానికి వచ్చింది ఏపీ వికేంద్రీకరణ బిల్లు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి దీన్ని మండలి సమక్షానికి తీసుకొచ్చారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి, మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఆ బిల్లును ఆమోదించాలని కోరారు. ఈ బిల్లుపై ఇప్పటికే నిప్పులు చెరుగుతోన్న తెలుగుదేశం పార్టీ.. తన చాకచక్యాన్ని ప్రదర్శించింది. రూల్ 71ను ప్రస్తావించింది. దీనితో అధికార పార్టీకి చుక్కెదురైంది.

ఏమిటీ రూల్ 71..
ఏపీ శాసన మండలి నిబంధనల్లోని 71వ రూల్ ఇది. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారాన్ని ఈ రూల్ ద్వారా శాసన మండలి సభ్యులకు సంక్రమిస్తుంది. అది ఎలాంటి నిర్ణయమైనా గానీ, శాసన సభలో ఆమోదం పొందినదైనప్పటిదైనా గానీ.. ఈ రూల్ కింద వ్యతిరేకించే అధికారం మండలి సభ్యులకు ఉంది. ఏ పార్టీకి సంబంధించిన సభ్యుడెవరైనా కూడా ఈ రూల్ను లేవనెత్తవచ్చు. దీనికోసం ఛైర్మన్ ముందస్తుగా ఛైర్మన్ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది.

సభా కార్యకలాపాల ప్రారంభానికి ముందే..
మండలి సమావేశాలు కార్యకలాపాలు ప్రారంభం కావడానికి ముందే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈ రూల్ను ప్రస్తావించదలచిన సభ్యుడు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే దీనికి సంబంధించిన తీర్మానాన్ని లిఖితపూరకంగా నోటీసు రూపంలో శాసన మండలి కార్యదర్శికి అందజేయాల్సి ఉంటుంది. ఈ రూల్కు ఎంతమంది మద్దతు ఇస్తున్నారనేది ఆ తరువాత ప్రస్తావనకు వచ్చే అంశం.

20 మంది సభ్యులకు తగ్గకుండా..
రూల్ 71 అంశానికి అనుగుణంగా మండలిలో చర్చ కొనసాగాలంటే దీనికి అనుకూలంగా కనీసం 20 మంది సభ్యుల బలం ఉండాలి. అలా ఉంటేనే.. ఇది చెల్లుబాటు అవుతుంది. 20 మందిలోపే సభ్యుల బలం ఉంటే దీన్ని వీగిపోయినట్టుగా గుర్తిస్తారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి శాసన మండలిలో 26 మంది సభ్యుల బలం ఉండటం వల్ల ఆ పార్టీకి ఢోకా లేదు. సభలో రూల్ 71 తీర్మానాన్ని ప్రస్తావించిన తరువాత వారం రోజుల్లో చర్చకు అనుమతించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications