ఏపీ సీఎస్కు నిమ్మగడ్డ మరో లేఖ..
ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఎన్నికల నిర్వహణపై పీఠముడి నెలకొంది. కరోనా కేసులు తగ్గినందున ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తోండగా.. అంతా సర్దుకోలేదని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే మార్చిలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణ జరగనుంది. అప్పటివరకు వెళ్లదీయాలని ప్రభుత్వం అనుకుంటుండగా.. హైకోర్టును ఆశ్రయించి మరీ ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ కృతనిశ్చయంతో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో లేఖ రాశారు. హైకోర్టు తీర్పు కాపీని లేఖకు జతచేసి మరీ పంపించారు. రాజ్యాంగ బద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ఎన్నికల నిర్వహణ, కమిషన్ విధి నిర్వహణలో ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని తీర్పులో న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని తీర్పులో ఎన్నికల కమిషన్ను ధర్మాసనం ఆదేశించింది. ఇదే విషయాన్ని తన లేఖలో ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు.

నిమ్మగడ్డ రాసిన లేఖపై సీఎస్ స్పందించాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. ఇప్పట్లో నిర్వహించలేమని చెబుతోంది. ఇదే విషయాన్ని మరోసారి చెప్పే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications