నివేదికలో హస్తం: కాగ్-రాఫెల్ డీల్లోకి విజయసాయిరెడ్డి, జగన్ను లాగిన టీడీపీ
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగ్ నివేదిక అంశంపై సదరు తెలుగుదేశం పార్టీ ఎంపీ కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు.

రాఫెల్పై కాగ్ నివేదిక, విజయసాయి రెడ్డిని లాగిన టీడీపీ
కాగ్ నివేదికను తప్పుదోవ పట్టించడంలో వైసీపీ నేత, ఆడిటర్ విజయసాయి రెడ్డి పాత్ర ఉందనే ప్రచారం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోందని ఎంపీ కనకమేడల అన్నారు. తిమ్మిని బమ్మిని చేయడంలో విజయసాయి రెడ్డి సిద్ధహస్తుడన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయల అవినీతిని రూ.43వేల కోట్లకు తగ్గించడంలో కీలక పాత్ర పోషించారన్నారు.

రాఫెల్లో లొసుగులు
రాఫెల్ కుంభకోణంలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్రాన్ని వెనుకేసుకు వస్తోందని ఎంపీ కనకమేడల అన్నారు. రాఫెల్ కుంభకోణంలో కాగ్ నివేదిక అనేక అంశాలను తప్పుదోవ పట్టించిందన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆడిట్ చేసిన దానిని కాగ్ నివేదికగా విడుదల చేసినట్లుగా ఉందన్నారు. అందులో అనేక లొసుగులున్నాయని ఆరోపించారు.

మసిపూసి మారేడుకాయ
ధర గ్యారెంటీ, బ్యాంక్ గ్యారెంటీ, సార్వభౌమ గ్యారెంటీ అంశాలు కాగ్ తన నివేదికలో పొందుపరచలేదని కనకమేడల అన్నారు. అందుకే బిడ్డింగ్ ఎక్కువా, తక్కువా అని నిర్ధారించలేమని కాగ్ స్పష్టం చేసిందన్నారు. రాఫేల్లో భారీ స్కాం జరిగిందని, అసలు విషయాలు తొక్కి పెట్టి మసిపూసి మారేడుకాయ చేశారన్నారు.












Click it and Unblock the Notifications