ఎలాంటి త్యాగానికైనా సిద్దం: కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటాం: విజయసాయిరెడ్డి
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని అన్నారు. స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో ఎలా నడిపించాలనే విషయంపై ప్రధాని మోడీకి సీఎం జగన్ రెండో సారి లేఖ రాశారని చెప్పారు.
పోరాటంతో సాధించుకున్న సంస్థ వైజాగ్ స్టీల్ అని విజయసాయిరెడ్డి అన్నారు. ప్లాంట్ కోసం జరిగిన ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ మొదట్లో లాభాల్లో నడిచిందని గుర్తుచేశారు. చంద్రబాబు పాలనలోనే నష్టాల బాట పట్టిందని ఆరోపించారు. సొంత ఐరన్ ఓర్ మైన్స్ లేకపోవడం సంస్థ పతనానికి మరో కారణమని చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయిస్తే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ కేంద్రం ప్రభుత్వం కేవలం నష్టాలను మాత్రమే చూపిస్తూ ప్రైవేటీకరణ చేయడం సరికాదని చెప్పారు.