ఆ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాన్ని కోరిన అచ్చెన్నాయుడు
ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు కట్టిన సంగతి తెలిసిందే. ఘటనను టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టారని.. ఆ నీచులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్కు ఎన్నో అవమానాలు జరిగాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్ తరచూ ఇలా జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. మహానేతపై ప్రభుత్వ వైఖరి సరికాదని మండిపడ్డారు.
ఎన్టీఆర్ విగ్రహాలకు గతంలో వైసీపీ నేతలు నిప్పుపెట్టారని గుర్తుచేశారు. పట్టపగలే దాడి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని కామెంట్ చేశారు. వారిపై ఆ నాడే కఠినంగా శిక్షించి ఉంటే ఇవాళ ఈ అవమానం జరిగేది కాదన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి పెద్ద అవమానమే చేస్తే... దాన్ని ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుడదని కోరారు. అలా జరిగితే తమ రియాక్షన్ మరోలా ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వానికి ఎన్టీఆర్ ఘటన పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఘటన జరిగిందని అనుకోవాల్సి ఉంటుందని కామెంట్ చేశారు.