పనికి మాలిన వ్యవస్థలను భోగి మంటల్లో తగులబెడుదాం..! యువతకు పవన్ పిలుపు..!!
గుంటూరు/ హైదరాబాద్ : తెలుగుదేశం ప్రభుత్వం పైన జనసైన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి మండిపడ్డారు. ప్రజా శ్రేయస్సుకోసం ఆ పార్టీకి మద్దత్తు తెలిపితే ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కాలం చెల్లిన వ్యవస్థల కొనసాగింపు వల్ల యువత నష్ట పోతున్నా ఎందుకు ప్రశ్నించకూడదని నిలదీసారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు గుంటూరుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయంగా పలు అంశాల పట్ల ఆసక్తిర వ్యాఖ్యలు చేసారు.
జనసేనను తక్కువ అంచనా వేయొద్దు..! వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతామన్న పవన్..!!
తాను టీడిపీ కి మద్దతు ఇచ్చింది పోటీ చేయడం చేతగాక, బలం లేక, పౌరుషం లేక కాదని, రాష్ట్రం బాగుండాలని నేను మద్దతు ఇచ్చానని, కానీ టీడిపి నేతలు అవినీతిలో మునిగి పోయారని జనసైనాని మండిపడ్డారు. రాజకీయాల్లో విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్న వ్యవస్థలను ప్రశ్నించేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు. జనసేన పార్టీ వెన్నుపోటు పునాదుల్లోంచి పుట్టిన పార్టీ కాదని, ప్రజల్లోంచి పుట్టిన పార్టీ అని పునరుద్ఘాటించారు.
ప్రజా శ్రేయస్సు కోసమే టీడిపికి మద్దత్తు..! కాని అవినీతిమయంగా మారిందని విమర్శ..!!
రాజకీయాలన్న తర్వాత ఆదిపత్యం ఉంటుందని, ఒకరి పై ఒకరు పైచేయి సాధించుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు చోటు చేసుకుంటాయని పవన్ చెప్పుకొచ్చారు. తనకు ఎన్నో బెదిరింపులు వచ్చినా, చనిపోతానేమో అని తెలిసినా కూడా పార్టీ పెట్టి నిలదీసింది ప్రజా సంక్షేమం కోసమే అని తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పు రావాలని, అణగారిన వర్గాల అభ్యున్నతికి క్రుషి చేస్తానని పవన్ చెప్పారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలంటే జనసేన ప్రభుత్వం రావాల్సిందేనన్నారు.
రైతులకు చేయూత ఇవ్వని ప్రభుత్వం..! రైతు సమస్యలను సమూలంగా పరిష్కరిస్తాం..!
ఎండు ఫలాలు పండించే రైతులు ఉన్నా వారికి ప్రభుత్వం సరైన చేయూత ఇవ్వలేకపోతోందని విమర్శించారు. విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం పైఉన్న శ్రద్ద స్థానికంగా అవి పండించే రైతాంగం పట్ల లేదని విమర్శించారు జనసేనాని. వారికి అండగా ఉంటాం, సేంద్రీయ వ్యవసాయం కోసం రైతులకు అండగా ఉంటామన్నారు. యువతకు అవకాశాలు కల్పించేందుకు జనసేన పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో రైతు సదస్సులు నిర్వహించి, వారి సమస్యలకు పరిష్కారం కనిపెడతానని పవన్ పేర్కొన్నారు.
వ్యవస్థలపై పోరాటానికి యువత ముందుకు రావాలి..! అప్పుడే ప్రగతి సాధిస్తామన్న పవన్..!!
ప్రస్తుతం దారి తప్పుతున్న రాజకీయ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన బాద్యత ఒక్క యువతపైనే ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. వ్యవస్థలో సమస్య ఉన్నప్పుడు యువత ఐకమత్యంగా స్పందించాలని అన్నారు. జాగో రే జాగో కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అదేనని పవన్ తెలిపారు.యువత స్మార్ట్ ఫోన్ లో వాట్సప్ లలో విహరించకుండా వ్యవస్థపై పోరాడాలని పిలుపునిచ్చారు. పనికి మాలిన వ్యవస్థలను భోగిమంటల్లో తగులబెట్టేందుకు యువత సాహసోపేత నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.