స్టార్ డమ్ అడ్డుకొని కామెంట్ చేయడం సరికాదు, పవన్పై పార్థసారథి ఫైర్
సీఎం జగన్ వర్సెస్ పవన్ కల్యాణ్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. సినిమా టికెట్ల మీద మొదలైన రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇవాళ నిర్మాతలు మంత్రి పేర్ని నాని కలువడం.. దిల్ రాజు ఇతర నిర్మాతలు ఆన్లైన్లో టికెట్లు విక్రయించాలని కోరామని చెప్పిన పరిణామాలు జరిగాయి. అయితే పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వంపై పవన్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే విరుచుకుపడ్డారు. సినీ రంగం వల్ల పవన్ బాగుపడ్డారు కానీ... ఆయన వల్ల సినీరంగం బాగుపడలేదని చెప్పారు.
హీరోగా ఉన్న స్టార్ డమ్ ను అడ్డం పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడటం సరికాదని అన్నారు. ప్రైవేట్ వెబ్ సైట్లు సినిమా ప్రేక్షకులను దోచుకుంటున్నాయని... రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 టికెట్ పై కేవలం రూ. 2 మాత్రమే వసూలు చేస్తుందని చెప్పారు. వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని పవన్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అసలు రాష్ట్ర సమస్యలపై పవన్ కు అవగాహన లేదని పార్థసారథి అన్నారు.

సంక్షేమ పథకాల వల్ల 6.81 కోట్ల మందికి రూ. లక్ష కోట్లకు పైగానే లబ్ధి చేకూరుతోందనే విషయాన్ని పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని హితవు పలికారు. టీడీపీ పాలనలో రోడ్లను మరమ్మతు చేయలేదని వివరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాల వల్ల రోడ్లు పాడయ్యాయని... రోడ్ల మరమ్మతులకు రూ. 2 వేల కోట్లతో టెండర్లను పిలిచిన సంగతి పవన్ కల్యాణ్కు తెలియదా? అని ప్రశ్నించారు. ఆయన మాటల్లో నిలకడ ఉండదని ఫైరయ్యారు.
పవన్ కల్యాణ్ పార్టీని పెట్టి ఇన్నేళ్లయినా, ఇంత వరకు ఒక ఎంపీపీని కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. రెండు చోట్ల పోటీ చేసి ఆయన ఓడిపోయారని అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఫిలిం ఛాంబర్ కూడా ఖండించిందని... ఆయన బుద్ధి తెలిసే నిర్మాతలు వచ్చి మంత్రి పేర్ని నానిని కలిశారని చెప్పారు. వైఎస్ వివేకా హత్య, కోడికత్తి దాడి టీడీపీ హయాంలో జరిగాయని... అప్పుడు వాటి గురించి ఎందుకు ప్రశ్నించలేదని పార్థసారథి నిలదీశారు. వర్గ శత్రువులు అంటూ పవన్ కల్యాణ్ కొత్త ఫిలాసఫీ తీసుకొచ్చారని... కమ్మవారు వైసీపీకి వర్గ శత్రువులు కాదని చెప్పారు.












Click it and Unblock the Notifications