మరోసారి: రఘురామరాజు అనర్హత వేటు వేయండి.. స్పీకర్కు వైసీపీ లేఖ
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని గతంలోనే వైసీపీ ఎంపీలు ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని వారు మరోసారి లేఖలో ప్రస్తావించారు. రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని గత ఏడాది జులై 3న ఫిర్యాదు చేశామని... జాప్యం చేస్తున్నారని లేఖలో వారు పేర్కొన్నారు.
ఇదే అంశంపై పలుమార్లు కలిసి ఫిర్యాదు చేసినా అనర్హత వేటు వేయకపోవడం దురదృష్టకరమని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఆర్టికల్ 10 ప్రకారం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రఘురామరాజును డిస్ క్వాలిఫై చేయాలన్నారు. దీనిపై ఇదివరకే చాలాసార్లు విన్నవించామని లేఖలో గుర్తుచేశారు. ఈ నెల 11వ తేదీన రిమైండర్ పిటిషన్ కూడా ఇచ్చామని వివరించారు.
అనర్హత పిటిషన్ ఇచ్చి 11 నెలలు అవుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు. దీనిపై సివిల్ ప్రొసిజర్ ప్రకారం వెళుతున్నామని తమకు సమాధానం అందిందని చెప్పారు. ఇదే అంశాన్ని చాలా సార్లు గుర్తుచేశామని.. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖపై ఓం బిర్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
రఘురామ కృష్ణరాజు వైసీపీలో పక్కలో బల్లెంలా మారారు. ప్రతీ అంశాన్ని విమర్శిస్తూ.. పార్టీ, అధి నాయకత్వం ఆగ్రహానికి గురవుతున్నారు. టీటీడీ నుంచి మొదలైన విభేదాల పర్వం.. అనర్హత వేటు వరకు వచ్చింది.