Anantapuramలో 161 కోవిడ్ రహిత గ్రామాలు...మొదటి వేవ్ నుంచి ఇప్పటివరకూ ఒక్క కేసు లేదు...!
కరోనా సెకండ్ వేవ్లో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇప్పటివరకూ కరోనా బారినపడకుండా ఉన్న గ్రామాలు కూడా దేశంలో చాలానే ఉన్నాయి. ఏపీలోని అనంతపురం జిల్లాలో దాదాపు 161 గ్రామాల్లో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని కలెక్టర్ గంధం చంద్రుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఒకే జిల్లాలో ఈ స్థాయిలో(4.81శాతం) కోవిడ్ రహిత గ్రామాలు ఉండటం విశేషమనే చెప్పాలి. కోవిడ్ కట్టడికి కృషి చేసి 161 గ్రామాలను కోవిడ్ రహితంగా నిలిపిన ప్రజలు,ప్రజాప్రతినిధులు,అధికారులకు కలెక్టర్ చంద్రుడు అభినందనలు తెలియజేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కరోనా కట్టడికి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే అనంతపురం మెరుగ్గా ఉందని... ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మిగతా గ్రామాల్లోనూ కొత్త కేసులు నమోదు కాకుండా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు.
రెండు రోజుల క్రితం జిల్లాల కలెక్టర్లతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని కలెక్టర్ చంద్రుడు ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో వార్డుల వారీగా కరోనా కట్టడికి కమిటీల ఏర్పాటుతో పాటు అన్ని గ్రామాల్లో జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమం చేపట్టినట్లు ప్రధానికి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న స్వచ్చ సంకల్పం పేరుతో బ్లీచింగ్ పౌడర్ను చల్లడంతో పాటు చెత్త చెదారం ఎప్పటికప్పుడు శుభ్రం చేసే చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఫీవర్ సర్వే ద్వారా ఎవరెవరు జ్వరంతో బాధపడుతున్నారో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించడం,కేవలం ఇల్లు పొలాలకే పరిమితవడం,అత్యవసరమైతే తప్ప ఊరు దాటకపోవడం వంటి చర్యలే తమ గ్రామాలను కరోనా రహితంగా మార్చాయని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు.
అనంతపురంలోని హిందూపూర్లో బుధవారం(మే 26) 1000ఎల్పీఎం(లీటర్ పర్ మినిట్) ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించారు.కేవలం కొద్ది వారాల వ్యవధిలోనే ఈ ప్లాంట్ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
The 1000LPM(LitresPerMinute) oxygen production plant at District Hospital/Hindupur is set all for inauguration today.Readied in less than a weeks time. Appreciations to Team led by @nishanthi_t @ArogyaAndhra @ysjagan @DrArjasreekanth @MoHFW_INDIA @DRDO_India @TalariRangaiah pic.twitter.com/Dws1uvy0Fn
— Gandham Chandrudu IAS (@ChandruduIAS) May 26, 2021