వర్ష బీభత్సం... అంధకారంలో అనంతపురం .. జలదిగ్బంధంలో పలు గ్రామాలు
అనంతపురంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం జిల్లాలో చాలావరకూ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.
టీటీడీ లో ప్రత్యేక ఆహ్వానితుల ప్రమాణ స్వీకారాలపై రగడ
నాలుగు రోజులుగా అనంతపురం జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వజ్రకరూరు, బెళుగుప్ప, విడపనకల్లు మండలంలో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెద్దవడుగూరు మండలం వెంకటాంపల్లి గ్రామంలో వర్షానికి గుడిసె కూలడంతో ఏడు సంవత్సరాల చిన్నారి మృతి చెందింది.అనంతపురం చాపలలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. యాడికి మండలం లక్ష్మాంపల్లెలో వరద ఉధృతికి ఒక ట్రాక్టర్, పలు ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకు పోయాయి.
గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుత్తి పట్టణంలో భారీ వర్షానికి జనావాసాలలోకి కొండచిలువ రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు కొందరు కొండచిలువను చంపేశారు. అంతే కాదు గుత్తిలో కప్పల వర్షం కురిసింది. గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలోకి వరద నీరు వచ్చి చేరింది.వజ్రకరూరులో ఛాయాపురంవంక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కళ్యాణదుర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. వరద నీటిలో పాములు కొట్టుకొని రావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
యాడికి మండలం వేములపాడులో కస్తూరిబా పాఠశాలలోకి భారీగా వర్షపునీరు చేరడంతో పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. ఇక ప్రహరీ గోడ కోల్పోవడంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను పామిడి కస్తూరిబా పాఠశాలకు తరలించారు.డోనేకల్ల్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బళ్లారి-గుంతకల్లు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అంతేకాదు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అనంతపురంలో అంధకారం అలముకుంది. కుంభవృష్టి అనంత వాసులకు కష్టాలు తెచ్చి పెట్టింది.