జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం- ఇక తాడిపత్రి కేంద్రంగా..!!
అనంతపురం: అనంతపురం జిల్లా రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయాలను తీసుకునే దిశగా సాగుతున్నారు. తాజాగా ఆయన తన అనుచరులు, పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు, కార్యకర్తలతో భేటీ కావడం జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లా రాజకీయాలపై మళ్లీ పట్టు సాధించేలా ఆయన నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.
అనంత లోక్సభపై..
అనంతపురం జిల్లాను తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చిన నాయకుల్లో జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతపురం లోక్సభతో పాటు తాడిపత్రి, శింగనమల, అనంతపురం అర్బన్, గుంతకల్.. వంటి నియోజకవర్గాలపై జేసీ బ్రదర్స్ పట్టు సాధించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీలకు అతీతంగా తమకంటూ ప్రత్యేక వర్గాన్ని, ఓటుబ్యాంకును సృష్టించుకున్నారు.
ఇద్దరూ తప్పుకొన్నా..
2019 సార్వత్రిక ఎన్నికల బరి నుంచి జేసీ బ్రదర్స్ ఇద్దరూ తప్పుకొన్నారు. తమ వారసులను రంగంలోకి దింపారు. అనంతపురం లోక్సభ స్థానం నుంచి జేసీ పవన్ కుమార్ రెడ్డి, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అస్మిత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు గానీ చేదు ఫలితాలను ఎదుర్కొన్నారు. వారిద్దరూ ఓటమి చవి చూశారు. తమ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతుల్లో పరాజయం పాలయ్యారు.
పట్టు నిలుపుకొన్న ప్రభాకర్..
ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తన పట్టు నిలుపుకొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనానికి ఎదురొడ్డి నిలిచారు. తాడిపత్రి మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గెలిచిన ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రి ఒక్కటే. ఈ ఎన్నిక- తాడిపత్రిపై జేసీ ప్రభాకర్ రెడ్డికి ఉన్న పట్టుకు, ఆయన రాజకీయ సామర్థ్యానికి నిలువుటద్దంలా మారింది.
పార్టీకి దూరంగా..
జేసీ ప్రభాకర్ రెడ్డి క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ- జేసీ దివాకర్ రెడ్డి మాత్రం కొంతకాలంగా స్తబ్దుగా ఉంటూ వస్తోన్నారు. అడపా దడపా వైఎస్ఆర్సీపీ నాయకులపై తనదైన శైలిలో ఘాటు విమర్శలు సంధించడం తప్ప పెద్దగా వార్తల్లో ఉండట్లేదు. క్రియాశీలక రాజకీయాల నుంచి ఆయన క్రమంగా తప్పుకొంటున్నారని, తన కుమారుడికి పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలను అప్పగించి, విశ్రాంతి తీసుకోవచ్చనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ఉంది.
త్వరలో చంద్రబాబుతో..
ఈ పరిణామాల మధ్య జేసీ దివాకర్ రెడ్డి- తన అనుచరులు, ముఖ్య నాయకులతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారనే సంకేతాలు పంపించినట్టయిందని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకో 16 నెలల సమయం మిగిలవున్నందున తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం మళ్లీ రాజకీయాల్లోకి క్రియాశీలకంగా వ్యవహరించనున్నారని సమాచారం. త్వరలోనే ఆయన చంద్రబాబు నాయుడితో భేటీ కానున్నారని, టికెట్ ఖాయం చేసుకుంటారనీ చెబుతున్నారు